ETV Bharat / city

EWS Reservations: టీఎస్​లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..తప్పని తేలితే సర్వీసు రద్దు

author img

By

Published : Aug 24, 2021, 9:28 PM IST

టీఎస్​లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
టీఎస్​లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

తెలంగాణలోని అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వార్షికాదాయం ఎనిమిది లక్షల్లోపు ఉన్న అగ్రవర్ణ పేదలందరికీ రాష్ట్రంలో పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

వార్షికాదాయం ఎనిమిది లక్షల్లోపు ఉన్న అగ్రవర్ణ పేదలందరికీ తెలంగాణలో పదిశాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. తహసీల్దార్ జారీ చేసే ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కుతాయన్న సర్కార్... తప్పుడు పత్రాలని తేలితే వెంటనే సర్వీసు నుంచి తొలగించడం సహా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు అనుగుణంగా సీట్లు పెంచాలని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు మూడో వంతు కోటా ఉండనుంది.

తెలంగాణలో ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది.

పది శాతం రిజర్వేషన్లు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణకు లోబడి రాష్ట్రంలోనూ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇవి దక్కుతాయి. కుటుంబం మొత్తానికి సంబంధించి అన్ని రకాల వార్షికాదాయం ఎనిమిది లక్షల రూపాయల్లోపు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులు. ముందు ఆర్థిక సంవత్సరంలో వేతనం, వ్యవసాయం, వ్యాపారం, ఇలా అన్ని రకాలుగా వచ్చిన ఆదాయాన్ని ఇందుకోసం పరిగణలోకి తీసుకుంటారు. తహసీల్దార్ ఇచ్చే ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత ఉంటుంది.

తప్పని తేలితే..

అన్ని పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించాకే సంబంధిత అధికారులు ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు పత్రమని తేలితే వెంటనే సర్వీసు నుంచి తొలగించడం సహా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. సరైన అభ్యర్థి లేక ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఆ ఖాళీ బ్యాక్​లాగ్​గా బదిలీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈడబ్ల్యూఎస్ నియామాకాల్లోనూ మహిళలకు మూడో వంతు ప్రత్యేక కోటా ఉంటుంది.

ఐదేళ్ల పాటు సడలింపు..

ఈడబ్ల్యూఎస్ కోటా వారికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్ల పాటు సడలింపు ఇచ్చారు. నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో పరీక్ష రుసుము మినహాయింపు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కోటా కోసం ప్రతి ఉన్నత విద్యాసంస్థలోని ప్రతి విభాగంలో సీట్లు పెంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం గతంలో జారీ చేసిన సబార్డినేట్ సర్వీసు నిబంధనలను సవరించిన ప్రభుత్వం... ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా రోస్టర్ పాయింట్లను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీచూడండి: sc commission at guntur : రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.