ETV Bharat / city

జాతీయ జెండా రూపకల్పన ఆలోచన ఎలా మెుదలైంది..?

author img

By

Published : Mar 29, 2021, 4:05 AM IST

special story on national flag of india
పింగళి వెంకయ్య

మనిషి సంఘజీవి. తనదైన ఉనికి కోసం, సమాజం కోసం, జాతి కోసం ఎంతైనా పోరాడతాడు. ప్రాణాలైనా ఇస్తాడు. అందులోనూ దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాక పాత్ర మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచంలో ఒక స్వేచ్ఛాయుత సమాజానికి మాత్రమే ప్రత్యేకజెండా ఉంటుంది. అది ఆ దేశ అస్తిత్వ పతాకగా.. ఆ దేశ ప్రజల ప్రతినిధిగా.. ఆ దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా.. వారందర్నీ ఏక తాటిపై నిలుపుతుంది. మన మువ్వొన్నెల జెండా ఈ క్రమంలో ఎన్నో కీలకఘట్టాలను అధిగమించాల్సి వచ్చింది.

ఏదైనా దేశం పేరు చెబితే మొదటగా మన స్మృతిపథంలో మెదిలే ఊహాచిత్రం ఆ దేశ చిత్ర పటం.. వారి జాతీయ పతాకం. అంతలా ఏ దేశానికి అయినా అదో అనివార్యం. ఆ స్వేచ్ఛ కోసం, ఆ గౌరవం కోసం ఎంతోమంది.. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో ప్రాణ త్యాగాలు చేశారు చరిత్రలో. భారత జాతీయ జెండా ప్రస్థానంలోనూ ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నాయి. ఈ జెండాల పుట్టుక నిన్నమొన్నటిది కాదు, అనాది నుంచీ ఉన్నదే. భారత్‌లోనూ.. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జాతీయ పతాకానికి రూపకల్పన జరిగింది. ప్రస్తుత రూపానికి మునుపు అనేక మార్పులకు లోనైంది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైంది.

ఇప్పటి జాతీయ పతాకానికి మాతృక పింగళివారు రూపొందించిన త్రివర్ణ పతాకమే. 1921 లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. కోట్లాది మంది ఏకతాటిపైకి తీసుకుని వచ్చి.. ఆ జెండా నీడనే పోరుబాటలో ముందుకు ఉరికారు. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా.. అవి సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ.. పింగళి రూపొందించిన పతాకం.. జాతీయోద్యమ పతాకంగా మారింది.

భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలనలోకి రావటానికి ముందు విజయనగర సామ్రాజ్యం మొదలు మొఘలుల సామ్రాజ్యం వరకు..అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. ఆయా రాజ్యాలు, సంస్థానాలకు వేటి జాతీయ జెండా వాటికి ప్రత్యేకంగా ఉండేవి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాకతో.. ఈ సంస్థ ద్వారా భారత్‌పై బ్రిటన్‌ పాలన సాగేది. 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో..ఈస్ట్‌ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటన్ సామ్రాజ్యం నేరుగా భారత దేశాన్ని తన పరిపాలన పరిధిలోకి తీసుకొచ్చింది.

అప్పుడే... భారత దేశానికి మొట్టమొదటగా ఓ జాతీయ జెండా వచ్చింది. అయితే అది ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే ఉండేది. వాటిపై బ్రిటిష్ సామ్రాజ్య జెండా యూనియన్ జాక్ తప్పనిసరిగా ఉండేది. 19వ శతాబ్దం చివర్లో భారతదేశంలో స్వాతంత్య్ర కాంక్ష.. జాతీయోద్యమం ఊపందుకునే సమయంలోనే భారత జాతీయ జెండా రూపకల్పన ఆలోచనలు బలపడ్డాయి. భిన్న వర్గాల పవిత్ర సంగమమైన వైవిధ్య భారతావనికి అదే స్థాయిలో స్వతంత్ర జెండా ఎలా ఉండాలన్న అంశంపై విస్తృత మేధోమథనం మొదలైంది.

ఆ పరిణామక్రమంలోనే.. 1931లో ఏర్పడిన ఫ్లాగ్‌ కమిటీ మతాలని విస్మరిస్తూ త్యాగనిరతికీ ఆత్మస్థైర్యానికీ ప్రతీకగా కాషాయాన్నీ, స్వచ్ఛతనీ నిజాయతీనీ చాటే తెలుపునీ, పాడిపంటల్నీ ప్రకృతితో అనుబంధాన్నీ సూచించే ఆకుపచ్చరంగునీ, సాధారణ ప్రజల్నీ వారి పరిశ్రమకీ గుర్తుగా నీలిరంగు రాట్నంతో జాతీయ పతాకాన్ని రూపొందించింది. ఉద్యమాన్ని ఏకతాటిమీదకి తీసుకొచ్చిన ఆ కాంగ్రెస్‌ జెండానే, జాతీయ జెండాగా దేశ ప్రజలందరి ఆమోదాన్నీ పొందింది.

చివరకు 1947 జూన్‌ 3న బ్రిటిషర్లు భారత్‌ను వీడనున్నట్లు ప్రకటించడం వల్ల మరోసారి ఫ్లాగ్‌ కమిటీ జాతీయ జెండామీద దృష్టి పెట్టి, మార్పుచేర్పులు చేసింది. రాట్నం స్థానంలో 24 ఆకులు ఉన్న ధర్మచక్రం పెట్టి, జాతీయ కాంగ్రెస్‌ జెండానే జాతి పతాకంగా రూపొందించి, జులై 22న అధికారికంగా బాబూ రాజేంద్రప్రసాద్‌కు అందించింది. అదే నేటి మువ్వన్నెల పతాకం. భారతీయు లు అందరి ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా.. దేశ గౌరవానికి చిహ్నంగా అలరారుతోంది. అందర్నీ ఒక్కటిగా ముందుకు నడిపిస్తోంది ఆ జెండా స్ఫూర్తే.


భారత జాతీయ పతాకలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన నిష్పత్తిలో ఉంటాయి. జాతీయ పతాకం పొడవు, వెడల్పు..3:2 నిష్పత్తిలో ఉంటాయి. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని జాతీ యావత్తూ గౌరవిస్తోంది. మధ్యలో రాట్నం స్థానంలో అశోకచక్రం చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జాతీయ జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుడి ధర్మచక్రం భారతదేశ పూర్వ సంస్కృతికి సంకేతంగా పేర్కొంటారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.