ETV Bharat / city

Plenary: ఆరు హామీలే అమలు చేయలేదు.. కరపత్రాల్లో వెల్లడి

author img

By

Published : Jul 9, 2022, 8:35 AM IST

Plenary: ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి 6 హామీలను అమలు చేయలేకపోయాం.. అని వైకాపా ప్లీనరీకి వచ్చిన వారికిచ్చిన కరపత్రాల్లో ముద్రించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆత్మీయంగా జగన్‌ రాస్తున్న ఉత్తరం అంటూ 4 పేజీల బుక్‌లెట్‌ను రూపొందించారు.

six promises were not implemented says ysrcp in pamphlets given at plenary
ఆరు హామీలే అమలు చేయలేదు.. కరపత్రాల్లో వెల్లడి

Plenary: ‘ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి 6 హామీలను అమలు చేయలేకపోయాం. మూడో ఏడాదీ సంక్షేమ బావుటా ఎగుర వేశాం’ అంటూ మూడేళ్ల వైకాపా పాలనలో చేసిన పనులపై ముద్రించిన కరపత్రాలను ప్లీనరీకి వచ్చిన వారికి పంపిణీ చేశారు. ప్రజలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖతోపాటు ప్రజా బ్యాలెట్‌నూ అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆత్మీయంగా జగన్‌ రాస్తున్న ఉత్తరం అంటూ 4 పేజీల బుక్‌లెట్‌ను రూపొందించారు. 2 పేజీలు ముఖ్యమంత్రి లేఖకు కేటాయించారు. ఇందులో వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన మార్పులని.. వాలంటీర్ల వ్యవస్థ, ఆంగ్ల మాధ్యమం, నాడు-నేడు, రైతుభరోసా కేంద్రాలు, దిశ చట్టం వంటి అంశాలను ప్రస్తావించారు. మరో 2 పేజీలను ప్రజాబ్యాలెట్‌ కోసం కేటాయించారు.

50 అంశాలతో ప్రశ్నావళి రూపొందించి ‘మీరే నిర్ణయించండి’ అంటూ వాటికి అవును, కాదు అని సమాధానం ఇవ్వాలని సూచించారు. చివరి పేజీలో ఫోన్‌ నంబరు ఇచ్చి మిస్డ్‌కాల్‌ ఇచ్చి వైకాపా పాలనకు మద్దతు పలకాలని విన్నవించారు.

2,200కు పైగా ఆర్టీసీ బస్సులు.. ప్లీనరీ కోసం పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు బుక్‌ కావడంతో.. అనేక మార్గాల్లో శనివారం తిరగాల్సిన సర్వీసులను రద్దు చేయనున్నట్లు తెలిసింది. వివిధ జిల్లాల నుంచి ప్లీనరీ కోసం వైకాపా నేతలు 2,200కు పైగా బస్సులు బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 11,000 బస్సులు నడుపుతుంటుంది. వీటిలో 2,200కు పైగా ప్లీనరీకి వెళ్లనున్నట్లు సమాచారం.

ఎన్‌హెచ్‌పై వాహనాల దారి మళ్లింపు.. ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వైకాపా ప్లీనరీ నిర్వహిస్తుండటంతో శుక్రవారం 16వ నంబరు జాతీయ రహదారిపై సరకు రవాణా వాహనాలను దారి మళ్లించారు. చెన్నై నుంచి విశాఖపట్నం, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలను ఒంగోలులోని త్రోవగుంట నుంచి నాగులుప్పలపాడు, చీరాల, బాపట్ల, కర్లపాలెం, భట్టిప్రోలు, పెనుమూరు వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి మళ్లించారు.శనివారమూ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.