ETV Bharat / city

Sajjala: హోదా కోసం రాజీనామా చేసి చూపించాం.. మిమ్మల్ని ఎవరైనా ఆపారా..?

author img

By

Published : Jul 24, 2021, 5:55 PM IST

Updated : Jul 25, 2021, 5:44 AM IST

special status for andhra pradesh
special status for andhra pradesh

17:53 July 24

special status for andhra pradesh

సజ్జల రామకృష్ణారెడ్డి , ప్రభుత్వ సలహాదారుడు

'అమరావతి అనేదే పెద్ద స్కాం. సాంకేతిక అంశాల ఆధారంగా ఏమైనా తిరస్కరించారేమో గానీ, వాస్తవం ఏంటో న్యాయస్థానాలకూ తెలుసు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘సాంకేతికపరంగా కోర్టులను సంతృప్తి పరచలేకపోయామేమో తెలియదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఏ నిర్వచనం ఇచ్చారో తెలియదు. ఏదైనా అమరావతి అనేదే పెద్ద స్కాం. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా చేసిన మోసం. అస్సైన్డ్‌ భూములను అడ్డగోలుగా తీసుకున్నదీ, రాజధాని వచ్చే సంగతి తెలిసీ ఎక్కడెక్కడ కొన్నదీ వ్యక్తుల పేర్లతో సహా మీడియాకు తెలుసు. వాటిని ప్రస్తావించడం కుదిరే పని కాదు’ అని వివరించారు.

ముందు రఘురామ.. వెనక చంద్రబాబు

‘ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే తెరముందు  రఘురామకృష్ణరాజును కూర్చోబెట్టి మాట్లాడించారు. దీని వెనక తల్లివేరు చంద్రబాబు అని తెలుస్తోంది.  అదృష్టవశాత్తు ఫోన్‌లో రికార్డెడ్‌గా అన్నీ బయటపడ్డాయి. న్యాయమూర్తుల్ని దుర్భాషలాడినవీ ఉన్నాయి. దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుంటుందని భావిస్తున్నాం’ అని సజ్జల చెప్పారు.

మా ఎంపీలు రాజీనామా చేయలేదా?

ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయొద్దని ఎవరైనా ఆపారా? అని సజ్జల ప్రశ్నించారు. ‘ప్రత్యేకహోదా కోసం గతంలో మా ఎంపీలు రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నారు. నిబద్ధత అంటే అది. ఆ పని చంద్రబాబు ఎందుకు చేయడం లేదు?’ అని నిలదీశారు.‘పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కడుతుంటే.. ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేశారు. ఇద్దరం చేద్దామని చంద్రబాబును పిలవలేదు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. మాకు సవాలు విసిరే బదులు.. తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని కోరుతున్నాం’ అన్నారు.

‘తెదేపా హయాంలో సలహాదారులు వందమందికిపైనే ఉన్నారు. కన్సల్టెంట్లు కూడా వేసుకుంటే 300 మంది ఉంటారు. ఆ రోజు పరకాల ప్రభాకర్‌, కుటుంబరావు అనేవారు పార్టీతో సంబంధం లేకున్నా  రోజూ రాజకీయ చర్చల్లో కూర్చునేవారు. మేం ముందునుంచి పార్టీలో ఉన్నాం. ఆ రోజు అది సరి అయింది. ఈ రోజు సలహాదారులు ఉండటమే తప్పని తెదేపా అనడం వింటే గురివిందలు నవ్విపోతాయి’ అని సజ్జల విమర్శించారు.

అవకాశాలను అందిపుచ్చుకుని బీసీలు ఎదగాలి

 సీఎం జగన్‌ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని బీసీలు పైకి ఎదగాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. శనివారం ముదిరాజ్‌ కులస్థుల రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇదీ చదవండి

Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి

Last Updated : Jul 25, 2021, 5:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.