ETV Bharat / city

తెలంగాణ: ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు

author img

By

Published : May 24, 2021, 7:53 PM IST

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు.. కానీ తెలంగాణలోని ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. పట్టుకోవటమే కాదు భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలో ఇటీవల జరిగిన ఓ భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు
ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు

ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన శివప్రకాశ్‌ అనే మార్వాడి ఈనెల 5న తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. 40 తులాల బంగారం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరిగి ఈనెల 20న మరో 1,330 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి అపహరణకు గురైందని మరోమారు అదే పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు తీవ్రతను బట్టి పోలీసులు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు శివప్రకాశ్‌ భార్య, గుంటూరుకు చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్‌లు నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశారు.

శివప్రకాశ్‌కు గుంటూరుకు చెందిన అర్చనతో 2008లో వివాహం జరిగింది. మార్వాడి కుటుంబానికి చెందిన వీరికి ముగ్గురు సంతానం. కారేపల్లిలో నివాసం ఉంటున్నారు. మనస్పర్ధలతో అర్చన గతేడాది భర్త నుంచి విడిపోయి.. గుంటూరులో ఉంటోంది. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం భర్త శివప్రకాశ్‌ తల్లి చనిపోవటంతో అర్చన కారేపల్లికి వచ్చింది. అప్పటినుంచి భర్తతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీ రాత్రి వెంకట కృష్ణప్రసాద్‌ను ఇంటికి పిలిపించి బంగారం, వెండి ఇచ్చి పంపించేసింది. చోరీ జరిగిన విషయాన్ని 5వ తేదీన గుర్తించిన శివప్రకాశ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి: రూ. 18 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.