ETV Bharat / city

వైభవంగా పెద్దగట్టు జాతర.. విజయవాడ మార్గంలో కొనసాగుతున్న ఆంక్షలు

author img

By

Published : Mar 3, 2021, 10:24 AM IST

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో... ఆలయ పరిసరాలు లింగ నామస్మరణతో మార్మోగుతున్నాయి. లింగమంతుల స్వామి, చౌడమ్మను దర్శించుకునేందుకు... ఆలయాల వద్ద బారులుతీరారు. సంప్రదాయానుసారం నిర్వహించే చంద్రపట్నం కార్యక్రమం ఘనంగా చేపట్టారు. జాతర దృష్ట్యా హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

peddagattu jathara in suryapet district
ఓలింగ నామస్మరణలతో మార్మోగుతున్న పెద్దగట్టు

ఎటుచూసినా భక్తజనం. చుట్టూ లింగ నామస్మరణలు. గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో పెద్దగట్టంతా మార్మోగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే దేవరకు మొక్కులు చెల్లించుకునేందుకు మునుపెన్నడూ లేని విధంగా భక్తజనం తరలివస్తోంది. చౌడమ్మతల్లికి మొక్కులు చెల్లించి... గండదీపాలతో లింగమంతుడికి భక్తులు నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు పెద్దగా రద్దీ లేకున్నా... ఆ తర్వాత క్రమంగా జనం రాక మొదలైంది. దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... పసుపు, కుంకుమలతో యాదవ హక్కుదారుల సంప్రదాయానుసారం చంద్రపట్నం కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • సందడిగా మారిన ఆలయ పరిసరాలు

వేలమంది భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌, దుకాణాల వద్ద వివిధ వస్తువులు కొనుగోలు, ఆటాపాటలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. జాతర నిర్వహణలో భాగంగా శిబిరాల వద్ద అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున... మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉండాల్సిందని భక్తులు చెబుతున్నారు. గతానికన్నా భిన్నంగా ఈసారి... లడ్డూల ధరలు మరీ ఎక్కువగా పెంచారని అభిప్రాయపడ్డారు. మరోవైపు మహిళలకు పెద్దగా వసతులు కల్పించలేదని... పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం విషయంలోనూ ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయన్నారు.

  • ట్రాఫిక్​ ఆంక్షలు

జాతర సందర్భంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కట్‎పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ వైపు మళ్లించారు. అలాగే, విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద హుజూర్‎నగర్ మీదుగా మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తున్నారు.

ఇదీ చదవండి:

పురపాలక ఎన్నికలకు తొలగిన న్యాయపరమైన అవరోధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.