ETV Bharat / city

Munugode Bypoll: మునుగోడులో పార్టీల మాస్టర్ ప్లాన్స్... నేతలకు కాసులతో గాలం

author img

By

Published : Oct 13, 2022, 9:58 AM IST

మునుగోడులో పార్టీల మాస్టర్ ప్లాన్స్
మునుగోడులో పార్టీల మాస్టర్ ప్లాన్స్

ఎన్నికలంటే పార్టీలు చేసే రాజకీయాల వేరు..! ఎత్తులు.. పైఎత్తులతో రసకందాయంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికలోనూ.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో.. తెరాస, కాంగ్రెస్‌, భాజపా వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని.. డబ్బులు, వాహనాలను తాయిళాలు ముట్టచెబుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తవారికి తాయిళాలు ఇచ్చి.. తమను విస్మరించడంపై పార్టీలోని అలకబూనుతున్నారు. వీరికి కూడా.. పార్టీలు ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది.

మునుగోడు..! ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ.. ఈ ఉపఎన్నిక కేంద్రంగానే జరుగుతున్నాయి. ఉపపోరులో గెలిచితీరాలనే పట్టుదలతో నియోజకవర్గంలోని నేతల బలాబలాలను అంచనా వేసుకుంటూ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు.. ఆయా గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసే.. ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకునేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఎంతో కొంత ముట్టజెపాల్సి వస్తుంది. ఈ పరిణామం సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తిని రాజేస్తోంది.

చౌటుప్పల్‌ పురపాలికలో ఓ ప్రధాన పార్టీ.. ఇతర పార్టీ కౌన్సిలర్లపై దృష్టిపెట్టి తమ పార్టీలో చేరితే 15 లక్షల వరకు ముట్టజెబుతామని హామీ ఇచ్చింది. దీంతో ఒకరిద్దరు కౌన్సిలర్లు సదరు పార్టీలో చేరారు. దీంతో పార్టీలో ఉన్నవారికి కాకుండా.. ఎదుటి పార్టీలోని వారికి అంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారని సొంత పార్టీ నాయకుల నుంచే అసమ్మతి వ్యక్తమైంది. ఈ క్రమంలో అసంతృప్తిని చల్లార్చేందుకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ నాయకుల అసమ్మతిని కట్టడి చేయడానికి మరో ప్రధాన పార్టీ .. వాహనాలు కొని ఇస్తోందని ప్రచారం ఊపందుకుంది.

మునుగోడు నియోజకవర్గంలోని ఓ మండలంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు వారం, పది రోజుల నుంచి కొత్త వాహనాల్లో తిరుగుతున్నారు. వీరిద్దరికీ పార్టీ ‘ముఖ్య’నాయకుడే వాహనాలు కొనిచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఎదుటి పార్టీలో ఉన్న నాయకులకే ఎక్కువ విలువ ఇస్తున్నారని.., స్థానికంగా తామే కొంతకాలంగా పార్టీని నడిపిస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా ఎంతో కొంత ఇస్తేనే ప్రచారంలోకి వస్తామని.. లేదంటే ఎదుటి పార్టీలోకి వెళతామని తెగేసి చెబుతున్నారు. అసంతృప్తుల వ్యవహారం అక్కడి ఇన్‌ఛార్జ్‌లకు తలనొప్పిగా మారింది.

నేతలను చేర్చుకోవడంతోపాటు.. అన్ని పార్టీలు కులాలవారీగా ఓట్లపైనా దృష్టిసారించాయి. నియోజవర్గంలో B.Cలే గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉండటంతో.. ప్రధాన పార్టీలు బీసీల్లోని వివిధ కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రధాన పార్టీ.. కేంద్ర స్థాయి నాయకుడితో సమావేశం నిర్వహించగా.. ఇవాళ మరో ప్రధాన పార్టీ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న కుల నాయకులతో సమావేశం కానుంది. మండలాల వారీగా కులాలకు కమ్యూనిటీ భవనాలు, వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెబుతూ.. తమ పార్టీకే మద్దతివ్వాలని నాయకులు సదరు కుల నాయకుల నుంచి ప్రమాణం తీసుకుంటున్నారు. ఇలా చేరికలు, తాయిలాలు, హామీలతో మునుగోడు ఉపప్రచారపర్వం ఆద్యంత డబ్బుమయంగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.