ETV Bharat / city

ఇంద్రకీలాద్రి: ఊపందుకుంటున్న ఉత్సవ టిక్కెట్ల అమ్మకాలు!

author img

By

Published : Sep 27, 2020, 9:53 AM IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ రాత్రోత్సవాల టిక్కెట్ల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటివరకు అన్ని కలిపి 30వేల టిక్కెట్లు బుక్కయ్యాయి. ఉత్సవాల సందర్భంగా రోజుకు పది వేల మంది భక్తులను అనుమతించనుండగా వీటికి సంబంధించిన టిక్కెట్లను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈసారి ఉత్సవాల్లో చాలా నిబంధనలు అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Book darshan tickets online for Dasara festival
Book darshan tickets online for Dasara festival

దసరా ఉత్సవాల టిక్కెట్ల అమ్మకాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటివరకు రూ.100, 300, ఉచిత దర్శనానికి కలిపి 30 వేల టిక్కెట్లు బుక్కయ్యాయి. మరో 60వేలు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు భక్తులను పరిమితంగానే అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు పది వేల మంది చొప్పున.. తొమ్మిది రోజులకు కలిపి 90వేల మందిని అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. అన్ని రోజులకు సంబంధించిన టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచారు. https:///kanakadurgamma.org/ వెబ్‌సైట్‌లోనికి వెళ్లి టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఉచిత దర్శనానికి వచ్చేవాళ్లు సైతం తప్పనిసరిగా టిక్కెట్‌ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా.. దసరా సమయంలో ఆలయానికి చేరుకుని టిక్కెట్లను కొనుగోలు చేసే అవకాశం ఈ సారి లేదు.

ఆన్ లైన్​లో టిక్కెట్లు....

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు అక్టోబరు 17 నుంచి 25 వరకు తొమ్మిది రోజులు జరగనున్నాయి. నెల రోజుల ముందుగానే ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఉంచారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు పది వేల మంది భక్తులను అనుమతించనుండగా వీటికి సంబంధించిన టిక్కెట్లను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. వీటిలో నాలుగు వేలు ఉచిత దర్శన టిక్కెట్లు కాగా, రూ.100, రూ.300 టిక్కెట్లు మూడువేల చొప్పున అందుబాటులో ఉంచారు. 90 వేలలో ఇప్పటివరకు 33శాతం టిక్కెట్లు అమ్ముడయ్యాయి. వీటిలో మూలా నక్షత్రం రోజు టిక్కెట్లు అధికంగా ఉన్నాయి. 30 వేల టిక్కెట్లలో 16 వేలు ఉచిత దర్శనానికి బుక్‌ చేసుకున్నారు. మిగతా 14వేలు రూ.100, రూ.300 టిక్కెట్లు కొనుగోలు చేశారు.

ఉచిత దర్శనానికి తప్పనిసరి....

ఈసారి దసరా ఉత్సవాల్లో చాలా నిబంధనలు అమల్లో ఉంటాయి. కచ్చితంగా టిక్కెట్‌ ఉంటేనే కొండపైకి రానిస్తారు. అందుకే దసరా దర్శనం చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ముందే టికెట్లు తీసుకోవాలి. అదికూడా ఏ రోజు.. ఏ సమయంలో వెళ్లాలనుకుంటున్నారో.. అక్కడ నమోదు చేశాక.. టిక్కెట్‌ జారీ అవుతోంది. ఉచిత దర్శన టిక్కెట్లు తొమ్మిది రోజులకు కలిపి 36 వేలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 16వేలు పూర్తవగా.. మరో 20 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా దసరా ఉత్సవాల చివరి రోజు, ఆ మరుసటి రోజు భవానీలను అనుమతిస్తారు. ఈ సారి వారికి సంబంధించిన ఏర్పాట్లు ఏమీ ఉండవని ప్రకటించారు. గిరి ప్రదర్శన, కృష్ణా నదీ స్నానం కూడా ఉండవు. అందుకే.. ఎవరు దర్శనానికి రావాలన్నా.. ఇప్పుడు టిక్కెట్‌ తీసుకుంటేనే అప్పుడు అనుమతి ఉంటుంది. దీనిపై సామాన్య భక్తులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో టిక్కెట్ల జారీ నెమ్మదిగా ఆరంభమై.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.

ఇదీ చదవండి

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.