ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ) బిల్లుకు ఏపీ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది. పీటీఐ కథనం ప్రకారం.. ఆన్లైన్లో రమ్మీ లాంటి జూదక్రీడలు, బెట్టింగ్ను నిషేధిస్తూ గేమింగ్ యాక్ట్-1974కు సవరణ తెస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమింగ్ కారణంగా కొంతమంది యువకులు అప్పుల్లో కూరుకుపోయి.. ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని సీఎం జగన్ అన్నారు. వాటిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ బిల్లును సవరించినట్లు తెలిపారు.
ఆన్లైన్ గేమింగ్కు పరిధి విధించడానికి ఏపీ గేమింగ్ యాక్ట్, 1974ను సవరించామని హోంమంత్రి సుచరిత అన్నారు. ఆన్లైన్ జూదం సమాజంలో నేరాలను ప్రేరేపిస్తోందన్నారు. మనీలాండరింగ్, మోసం వంటి నేరాల సంఖ్యను పెంచుతుందన్నారు.
"జూదం వెబ్సైట్లు ప్రామాణికమైనవి కావు, ఈ సైట్ల చట్టబద్ధతను తనిఖీ చేయడానికి నియంత్రణ చర్యలు లేవు. ఈ సైట్లు వినియోగదారులను మోసం చేయడం చాలా సులభం. ఇది చాలా భద్రత, గోప్యతా సమస్యలను లేవనెత్తుతుంది" -హోంమంత్రి సుచరిత
ఈ సవరణ ప్రకారం మొదటిసారి నేరానికి పాల్పడితే ఏడాది జైలుశిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తారు. ఒకటికంటే ఎక్కువసార్లు జూదం, బెట్టింగ్కు పాల్పడినా, ఆడించినా.. రెండేళ్ల జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద జరిగే ప్రతి నేరం నాన్ బెయిలబుల్ కిందకు వస్తుందని పీటీఐ కథనం పేర్కొంది.
ఇదీ చదవండి: