ETV Bharat / city

దీపక్​రెడ్డి వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: హైకోర్టు

author img

By

Published : Mar 18, 2021, 4:38 AM IST

హైకోర్టు
హైకోర్టు

తాడిపత్రి పురపాలక ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్​అఫీషియో సభ్యునిగా ఓటుహక్కు కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ... తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేనాటికి పిటిషనర్... రాయదుర్గం మున్సిపాలిటి పరిధిలో ఓటరుగా ఉన్న కారణంగా అక్కడే ఎక్స్​అఫీషియో సభ్యులవుతారని స్పష్టం చేసింది. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్​అఫీషియో సభ్యునిగా ఓటుహక్కు అభ్యర్థనను పురపాలక కమిషనర్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ... తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం జరగనున్న ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఓటు వేసేందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తాడిపత్రి మున్సిపాలిటిలో ఎక్స్​అఫీషియో సభ్యునిగా ఐచ్ఛికాన్ని ఇచ్చారని పిటిషనర్ తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

తాడిపత్రి మున్సిపాలిటిలో ఓటరుగా ఉన్నారు. పిటిషనర్ ఓటు మొదట రాయదుర్గంలో ఉండేది. తర్వాత తాడిపత్రికి బదిలీ చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్ ఓటు నిరాకరిస్తూ ఈనెల 13న ఉత్తర్వులిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఇచ్చింది ఈ నెల 14న. ఓటు నిరాకరించడం వెనుక దురుద్దేశం ఉంది. ఓటు నిరాకరించే అధికారం మున్సిపల్ కమిషనర్​కు లేదు.- పిటిషనర్ తరఫు న్యాయవాది

మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 5 (2) (42) ప్రకారం.. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేనాటికి ఏ మున్సిపాలిటి పరిధిలో ఓటరుగా నమోదై ఉంటారో అక్కడే ఎక్స్​అఫీషియో సభ్యునిగా పరిగణిస్తారన్నారని ఎస్​ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఆ నిబంధనల ప్రకారం పిటిషనర్ రాయదుర్గం మున్సిపాలిటికి ఎక్స్​అఫీషియో సభ్యులయ్యారని చెప్పారు. చిరునామా మార్చుకున్నందునా ఇటీవల ఎన్నికల్లో తాడిపత్రిలో ఓటు వినియోగించుకొని ఉండొచ్చన్నారు. పిటిషనర్ నివాసం తాడిపత్రికి మార్చుకొని అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న కారణంగా... తాడిపత్రి మున్సిపాలిటిలో ఎక్స్​అఫీషియో సభ్యునిగా ఇచ్ఛికం ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదించారు.

ఇరువైపు వాదనల విన్న న్యాయమూర్తి... మార్చి 14న ఇచ్చిన ఫిర్యాదు విషయాన్ని పిటిషనర్​కు ఓటుహక్కు నిరాకరిస్తూ మున్సిపల్ కమిషనర్ మార్చి 13న జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నిబంధనలు పిటిషనర్​కు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పిటిషనర్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేనాటికి రాయదుర్గం మున్సిపాలిటిలో ఓటరుగా ఉన్న కారణంగా కేవలం ఆ మున్సిపాలిటికి ఎక్స్​అఫీషియో సభ్యులవుతారని... ఈవ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ... మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. నెల్లూరులో సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.