ETV Bharat / city

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

author img

By

Published : Jul 20, 2021, 2:54 PM IST

Updated : Jul 21, 2021, 3:47 AM IST

night curfew extended in ap
night curfew extended in ap

14:51 July 20

కర్ఫ్యూ కొనసాగింపు...

కొవిడ్‌ ఆంక్షల్లో భాగంగా రాత్రి పూట విధించిన కర్ఫ్యూను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ ఆంక్షలు బుధవారంతో ముగుస్తున్నందున మరోసారి పొడిగిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకు యథాతధంగా కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొవిడ్‌-19 నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌లపై ఉన్నతాధికారులతో చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘‘జన సమూహాలపై కొవిడ్‌ ఆంక్షలు కొనసాగించాలి. కరోనా మూడో వేవ్‌పై సంకేతాలు ఉన్నందున విజయవాడ, విశాఖ, తిరుపతిలో పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆసుపత్రుల పనుల వేగం పెంచాలి. పోలీసు బెటాలియన్లలోనూ వైద్య పరికరాలు, వైద్యులను సిద్ధం చేయాలి. కమ్యూనిటీ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ పడకలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచాలి. టెలీ మెడిసిన్‌ సేవలను ఉప ఆరోగ్య కేంద్రాల వరకు విస్తరించాలి. యాభై పడకలు ఉన్న ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు 30% ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేసిన అనంతరం ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత మే నుంచి ఇప్పటివరకు ప్రైవేట్‌ ఆసుపత్రులకు కేంద్రం 35 లక్షల డోసులు ఇవ్వగా... అందులో 4.63 లక్షలు మాత్రమే వినియోగమైంది. ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరాలి. తగిన ప్రణాళికతో 11 లక్షల డోసులు ఆదా చేశాం’’ అని సీఎం వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని (వైద్యం), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్‌ పురోగతి ఇలా...
రాష్ట్రంలో టీకాల పంపిణీ పురోగతిని సీఎంకి అధికారులు వివరించారు. ‘‘కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 డోసుల వ్యాక్సిన్‌ వచ్చింది. ప్రస్తుతం 8,65,000 డోసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,41,42,094 మందికి టీకాలు వేశాం. తొలి డోసు 1,00,34,337, రెండు డోసులు 41,07,757 మంది చొప్పున పొందారు. ఐదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులందరికీ వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. విదేశాలకు వెళ్లే వారిలో 31,796 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది’’ అని చెప్పారు.

ఎనిమిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు 3%
8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 3%గా ఉందని అధికారులు సీఎంకి తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 24,708 క్రియాశీల కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 2.83%గా ఉంది. ఎనిమిది జిల్లాల్లో పాజిటివిటీ రేట్‌ 3%, మిగిలిన జిల్లాల్లో 3%-5% మధ్య పాజిటివిటీ రేటు నమోదైంది. రికవరీరేటు 98.05%గా నమోదైంది. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో 94.19% మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 13వ దఫా ఫీవర్‌ సర్వే పూర్తయింది’’ అని వివరించారు.

గతంలో నిర్ణయించిన పనివేళలకే ప్రభుత్వ కార్యాలయాలు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలన్నీ గతంలో నిర్ణయించిన పనివేళల్లోనే పనిచేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి, వాటి నియంత్రణలోని ఉప కార్యాలయాలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలన్నారు. సచివాలయ శాఖలు, జిల్లా కార్యాలయాలు ఈ సమయాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 

Ycp Protest in Rajyasabha: రాజ్యసభలో వైకాపా ఎంపీల నిరసన.. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్!

Last Updated : Jul 21, 2021, 3:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.