ETV Bharat / city

Modern Fish Market: బేగంబజార్​లో అందుబాటులోకి సమీకృత చేపల మార్కెట్

author img

By

Published : Sep 11, 2022, 3:24 PM IST

Begumbazar fish market
బేగంబజార్ చేపల మార్కెట్‌

Begumbazar fish market: ఎట్టకేలకు ఆరు దశాబ్ధాల కల నేరవేరింది. నిత్యం రణగోణ ధ్వనులు, కాలుపెట్టలేని జనం రద్దీ, తీవ్ర దుర్గంధం వెదజల్లే హైదరాబాద్ బేగంబజార్ చేపల మార్కెట్‌ కొత్త సొగబులు సంతరించుకుంది. మత్స్య వ్యాపారులు, స్థానిక ప్రజాప్రనిధులు ఎన్నో విజ్ఞప్తులు, వినతిపత్రాల ఫలితంగా వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక చేపల మార్కెట్‌ సముదాయంగా అవతరించింది. నూతనంగా రూ.9.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించిన సమీకృత చేపల మార్కెట్‌ను పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు.

Begumbazar fish market: హైదరాబాద్‌ బేగంబజార్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన సమీకృత చేపల మార్కెట్‌ అందుబాటులోకి వచ్చింది. పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న జంట నగరాల్లోకెల్ల అతి పురాతన చేపల మార్కెట్‌ కొత్త రూపుదిద్దుకుంది. నూతనంగా 9.50 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక మౌలిక సదుయాలతో కూడిన ఈ సమీకృత చేపల మార్కెట్‌ సముదాయాన్ని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.

పర్యావరణహిత మార్కెట్:​ వినియోగదారులకు నాణ్యమైన చేపలు సరఫరా చేసేందుకు మత్స్యకారులు, వ్యాపారులు, కార్మికులను ప్రోత్సహించే లక్ష్యంతో మత్స్య శాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, ఎన్‌ఎఫ్‌డీబీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ మార్కెట్‌ నిర్మించారు. మొత్తం 3500 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో మూడు అంతస్థుల భవన సముదాయంలో పూర్తిగా పర్యావరణం, పరిశుభ్రతకు పెద్దపీట వేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో హోల్‌ సేల్ సెక్షన్‌లో 43 స్టాళ్లుసహా ఐస్‌ ఫ్లేక్ మిషన్, కోల్డ్‌ స్టోరేజీ గది ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్‌లో చిల్లర విక్రయాలు, కటింగ్ సెక్షన్‌ సెక్షన్లుగా విభజించి 90 రిటైల్‌, 71 కటింగ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు.

వ్యాపారులు కోసం క్యాంటీన్​ సదుపాయం: ఇక మూడో ఫ్లోర్‌లో వినియోగదారులు, వ్యాపారుల కోసం ఒక క్యాంటీన్‌సహా 1ఏ డ్రైఫిష్ స్టాళ్లు నెలకొల్పారు. వినియోగదారుల సౌకర్యార్థం సెల్లార్‌లో కార్డు, మోటర్ సైకిళ్ల పార్కింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్లైంది. సుధీర్ఘకాలంగా తాము ఎదురు చూస్తున్న కల నెరవేరిందని బేగంబజార్ చేపల మార్కెట్ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.


60ఏళ్ల క్రింతమే బీజం పడింది: అప్పటి జనాభా, మార్కెట్‌ అనుగుణంగా బేగంబజార్‌లో చేపల మార్కెట్ నిర్మించాలన్న డిమాండ్ 60 ఏళ్ల క్రితం బీజం పడింది. నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రులు, ప్రభుత్వాలకు వినపత్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే ముఖేష్‌గౌడ్‌ చొరవతో అప్పట్లో కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్జీఆర్, చంద్రబాబు, వైఎస్ ప్రభుత్వాల హాయాంలో అధినేతల నుంచి హామీలు లభించినప్పటికీ సరైన కృషి, చొరవ లేకపోవడం వల్ల ఏమీ కార్యరూపం దాల్చలేదు.

న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని: ఈ క్రమంలో అధ్యాన్నమైన పారిశుద్ధ్యం, తీవ్ర దుర్గంధం మధ్య మార్కెట్‌కు వచ్చి వినియోగదారులు చేపలు, రొయ్యలు, ఎండు చేపలు కొనుక్కోవాల్సి వచ్చేది. ఏ మాత్రం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ సమస్యపై అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తావించారు. ఆ స్థలం హెరిటేజ్‌ పరిధిలో ఉన్న దృష్ట్యా కొంత కాలంపాటు జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ కృషి ఫలితంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి రెండేళ్లల్లో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి చేయూతనివ్వడం సంతోషంగా ఉందని కార్పోరేటర్ శంకర్ యాదవ్ అన్నారు.

త్వరలో మరో చేపల మార్కెట్​ అందుబాటులోనికి: గోవా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహాలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన టోకు, చిల్లర చేపలు, రొయ్యల సమీకృత మార్కెట్లు ఉన్నాయి. బేగంబజార్ తరహాలో నగరం చుట్టు పక్కల ఆధునిక మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఇప్పటికే కూకట్‌పల్లిలో అద్భుతమైన సమీకృత మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. బేగంబజార్‌ చేపల మార్కెట్‌ రెండోది. త్వరలో మల్లాపూర్‌లో కూడా మరో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన చేపల మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.

ఎక్స్‌ఫోర్ట్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్‌ నిర్మాణం: అలాగే, నగర శివారు కోహెడలో అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో కూడిన మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఎక్స్‌ఫోర్ట్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్‌ నిర్మించేందుకు మత్స్య రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బాహ్య వలయ రహదారి సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణం భూమి కూడా సేకరించిన దృష్ట్యా త్వరలో సీఎం నుంచి అనుమతి రాగానే ఎక్స్‌ఫోర్ట్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్‌ నిర్మాణం కోసం భూమిపూజ చేయనున్నామని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా చెప్పారు.

1500మందికి ఉపాధి: ఒక్క బేగంపేట చేపల టోకు మార్కెట్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1500 మంది పైగా వ్యాపారులు, మత్స్యకారులు, కార్మికులు, ఇతర పారిశుద్ధ్య సిబ్బంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ అత్యాధునిక సమీకృత మార్కెట్‌ సముదాయం అందుబాటులోకి రావడంతో ఇక నుంచి ఈ మార్కెట్‌లో ఆరోగ్యకరమైన వాతావరణం నడుమ మంచి చేపలు, రొయ్యలు, ఎండు చేపల వినియోగదారులకు లభ్యమవుతాయి. నాణ్యమైన వ్యాపారం సాగుతుందని మత్స్య శాఖ, జీహెచ్‌ఎంసీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.