ETV Bharat / city

Janasena: జనసేనకు మాత్రమే నిబంధనలు, నిర్బంధాలా..? పవన్

author img

By

Published : Jul 20, 2021, 6:24 PM IST

Janasena
Janasena

వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత పక్షాన.. జనసేన పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు. అరెస్టులు, నిర్బంధాలతో నిలువరించలేరన్నారు.

జనసేన పార్టీ.. నిరుద్యోగ యువత పక్షాన నిలుస్తుందని, గొంతు నొక్కాలనుకుంటే ఉపేక్షించబోమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అర్ధరాత్రి అరెస్టులు... నిర్బంధాలతో జనసేన నాయకులు, శ్రేణులను నిలువరించలేరన్నారు. ఎంతగా కట్టడి చేయాలని చూసినా నిరుద్యోగుల కోసం వినతి పత్రాలు అందించగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, జన సైనికులకు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు.

అక్రమంగా అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని పవన్ అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపడితే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి పార్టీ కార్యక్రమానికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారన్నారు. అర్థరాత్రి నుంచి గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసి పార్టీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు.

'ధర్మం, న్యాయం పక్షాన మాట్లాడటం, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్ళడం జనసేన నైజం. నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కి నిలువరించడం సాధ్యం కాదు. ఎంతగా కట్టడి చేయాలని చూసినా నిరుద్యోగుల కోసం జనసేన నాయకులు, శ్రేణులు జిల్లా ఉపాధి అధికారులకు వినతి పత్రాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికీ, ప్రతి జన సైనికుడికి హృదయపూర్వక అభినందనలు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం శాంతియుతంగా కార్యక్రమం చేపడితే నోటీసులు ఇచ్చి నిబంధనలు పెట్టి, నిర్బంధాలు చేశారు. ఈ నిబంధనలు అధికార పార్టీ వేల మందితో చేసే కార్యక్రమాలు, సన్మానాలు, ఊరేగింపులకు ఎందుకు వర్తించడం లేదు ' - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీ చదవండి:

RRR: ప్రత్యేక హోదాపై ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమే: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.