ETV Bharat / city

నిధుల్లేక నత్తనడక.. రెండోదశ పనులకు శంకుస్థాపన చేసి 10నెలలు..

author img

By

Published : Jun 29, 2022, 4:11 AM IST

Nadu-Nedu
Nadu-Nedu

Nadu-Nedu: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ రెండో దశకు నిధుల కొరత కారణంగా పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం నెలకొంది. శంకుస్థాపన చేసి 10నెలలు గడిచినా ఇప్పటికీ పనుల్లో వేగం లేదు. ఈ నెలాఖరులోగా అన్నిచోట్ల పనులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశించినా ఆ స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదు.

Nadu-Nedu: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ రెండో దశకు నిధుల కొరత కారణంగా పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం నెలకొంది. రెండోవిడతకు గత ఏడాది ఆగస్టు 16న సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జులైలో పూర్తి చేస్తామని ప్రకటించారు. శంకుస్థాపన చేసి 10నెలలు గడిచినా ఇప్పటికీ పనుల్లో వేగం లేదు. ఈ నెలాఖరులోగా అన్నిచోట్ల పనులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశించినా ఆ స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండోవిడత పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే.

నాబార్డు నిధుల విడుదలలో జాప్యం..

నాబార్డు నిధులు రూ.2,538కోట్లతో 3,199 బడుల్లో పనులు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.1,378కోట్లతో 1,196 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరో 2,003 పాఠశాలల్లో అదనపు గదులు, అదనపు మౌలికసదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొంది. నాబార్డు నిధులు విడుదల కావడంలో జాప్యం ఏర్పడింది.

* ప్రపంచబ్యాంకు పాఠశాలల్లో అభ్యసన మెరుగుకు రూ.1,862కోట్లు రుణం ఇస్తుంది. ఇందులో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, భవనాల మరమ్మతు, ఫర్నిచర్‌, స్మార్ట్‌ టీవీ, లైట్లు, ఫ్యాన్లు లాంటి మౌలికసదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వనుంది. మొదటిదశలో వ్యయం చేసిన రూ.3,669కోట్లకు రీయంబర్స్‌మెంట్‌ చేయాలని విద్యాశాఖ కోరింది. ఇటీవలే ప్రపంచబ్యాంకు బృందం ఆయా పాఠశాలలను సందర్శించింది. రూ.1,500కోట్ల వరకు ఇవ్వనుంది.

* ‘నాడు-నేడు’కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విరాళాలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర సంస్థలు, ఇతరత్రా ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకోగా.. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.

గదులు లేకుండానే బెంచీలు కొనుగోలు..

అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే డ్యుయల్‌ డెస్క్‌లు కొనేందుకు టెండర్లు పూర్తి చేశారు. సుమారు 2.20లక్షల డ్యుయల్‌ డెస్క్‌లను సుమారు రూ.268కోట్లతో కొనుగోలు చేసేందుకు గుత్తేదారు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. పనులపై దృష్టిపెట్టాల్సిన ఏపీ విద్య, సంక్షేమ మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఈడబ్ల్యుఐడీసీ) టెండర్లకే ప్రాధాన్యం ఇస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇనుము ధరలు అధికంగా ఉన్న సమయంలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.

* గదుల నిర్మాణం పూర్తి చేసేందుకు నాలుగైదు నెలలకుపైగా సమయం పడుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే విద్యార్థులు చెట్ల కింద కూర్చునే సమస్య తప్పుతుంది.

* ఎలక్ట్రికల్‌ పనులకు సంబంధించిన టెండర్లు దాదాపు పూర్తి చేశారు. గుత్తేదార్లు అధిక ధరలకు వేయడంతో తగ్గించుకోవాలని సంప్రదింపులు సాగిస్తున్నారు. రివర్స్‌లోనూ ఇంకా ధర తగ్గించుకోవాలని ఏపీఈడబ్ల్యుఐడీసీ కోరుతోంది.

* సిరమిక్‌ టైల్స్‌, మరుగుదొడ్లు సామగ్రికి సంబంధించిన ఒక ప్యాకేజీ పూర్తి చేశారు. మరో మూడు ప్యాకేజీలు టెండర్ల దశలో ఉన్నాయి.

కొన్నింటికే అడ్వాన్సు..

* రెండోవిడతలో 22,344 పాఠశాలలు, వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.8వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. సుమారు 9వేల పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించనున్నారు.

* 11,786 తల్లిదండ్రుల కమిటీలకు అడ్వాన్సుగా 15శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ను వేశారు. మరో 10,558 బడులకు ఇవ్వాల్సి ఉంది. కొన్నిచోట్ల పనులు ప్రారంభం కాగా మరికొన్నిచోట్ల సిమెంటు, ఇసుక అందకపోవడంతో ప్రారంభించ లేదు.

‘నాడు-నేడు’లో నగుబాటు పనులు!

.

‘నాడు-నేడు’ పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించినట్లు ప్రభుత్వం చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ఒకవైపు జులై 4నుంచి బడి తెరవాల్సి ఉండగా.. విజయవాడ దుర్గాపురం టి.వెంకటేశ్వరరావు ఉన్నత పాఠశాలలో పనులు ఇప్పుడు మొదలుపెట్టారు. దాదాపు 800 మంది విద్యార్థులు చదువుకునే ఈ స్కూల్లో కొత్త గదులు నిర్మిస్తామని పాత భవనాన్ని కూలగొట్టారు. ఇప్పుడు విద్యార్థులకు 12 గదులు మాత్రమే మిగిలాయి. అవి సరిపోయే పరిస్థితి లేదు. కనీసం వరండాలోనైనా కూర్చునే వీల్లేకుండా పాత కుర్చీలు, బల్లలు వేశారు. అయినా.. వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులు ఇప్పుడు మొదలుపెడితే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.