భారత్లో తయారయ్యే విదేశీ మద్యం బ్రాండ్లలో (ఐఎంఎఫ్ఎల్) తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛను రాష్ట్రంలోని మద్యం ప్రియులకు కల్పించాలని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ) సీఈవో నీతా కపూర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో ఐఎంఎఫ్ఎల్ దుకాణాలను పెట్టేలా ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పర్యాటక విధానంతో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుందన్నారు. ఇవే బ్రాండ్లను ఎంచుకునే స్వేచ్ఛ స్థానిక మద్యం ప్రియులకూ ఉండాలని ఆమె ఒక ప్రకటనలో కోరినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కేరళలో మద్య నియంత్రణతో ఎదురైన అనుభవాలను, పర్యాటకం దెబ్బతిన్న తీరును అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని నీతా కపూర్ కోరారు. కొత్త స్థానిక బ్రాండ్లకు, ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లకు మధ్య వివక్ష చూపవద్దని ఐఎస్డబ్ల్యూఏఐ సెక్రటరీ జనరల్ సురేష్ మేనన్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చాలా మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోనూ తయారవుతున్నారని ఆయన గుర్తు చేశారు. నచ్చిన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచకపోవడం వల్ల వినియోగదారులు అక్రమ పద్ధతుల్లో వాటిని పొందడానికి ప్రయత్నిస్తున్నారని, కొన్నిసార్లు కల్తీ, నకిలీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని సురేష్ మేనన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండీ.. appsc:నోటిఫికేషన్లేవీ?...ప్రభుత్వ ఉత్తర్వులు రాక జాబ్ క్యాలెండర్ పై స్తబ్ధత