ETV Bharat / city

కోర్టు ధిక్కరణ కేసులో శిక్షపై భిన్న తీర్పులు

author img

By

Published : Mar 2, 2022, 3:43 AM IST

హైకోర్టు
హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా భిన్నమైన తీర్పులు ఇచ్చారు. న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాల నేపథ్యంలో.... ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర వద్దకు నివేదించారు. మూడో న్యాయమూర్తి ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడించాల్సి ఉంటుంది.

కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన అప్పీల్‌పై విచారించిన ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులిచ్చారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌- సీసీఎఫ్‌), ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎన్‌.ప్రతీప్‌కుమార్‌కు సింగిల్‌ జడ్జి 4వారాల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించగా.. ధర్మాసనంలోని జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా 4వారాల జైలును వారం రోజులకు కుదించారు. జరిమానాను రూ.10వేలకు పెంచారు. సింగిల్‌ జడ్జి ఆదేశాల అమల్లో సీసీఎఫ్‌ జాప్యం చేశారని ఆయన పేర్కొన్నారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌.. సంశయ లబ్ధి కింద కోర్టు ధిక్కరణ శిక్ష నుంచి ప్రతీప్‌కుమార్‌కు ఉపశమనం కల్పించారు. సింగిల్‌జడ్జి ఉత్తర్వుల అమల్లో జాప్యం కేవలం పొరపాటున, ఏమరపాటున జరిగిందేనని అభిప్రాయపడ్డారు. ధర్మాసనంలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచినందున తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రకు నివేదించారు. మూడో న్యాయమూర్తి నిర్ణయం వెల్లడించాల్సి ఉంటుంది. మూడో న్యాయమూర్తి ఎవరనేది సీజే పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

నేపథ్యమిదీ..

ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎం.జగదీష్‌చంద్ర ప్రసాద్‌ 2019 డిసెంబరులో సస్పెండయ్యారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో వాటిని 2020 ఆగస్టులో హైకోర్టు నిలిపేసింది. కోర్టు ఉత్తర్వులిచ్చినా తనను ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్‌లోనే ఉంచారని అటవీ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రతీప్‌కుమార్‌పై జగదీష్‌చంద్ర ప్రసాద్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు.. ప్రతీప్‌కుమార్‌కు 4వారాల సాధారణ జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ గతేడాది అక్టోబరులో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సీసీఎఫ్‌ ప్రతీప్‌కుమార్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఇటీవల విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. న్యాయమూర్తులు సోమవారం వేర్వేరుగా నిర్ణయాలు వెల్లడిస్తూ తీర్పులిచ్చారు.


ఇదీ చదవండి: high court : 'సాక్షులను బెదిరించినట్లు ఆధారాలుంటే కోర్టు ముందు ఉంచండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.