ETV Bharat / city

JNTUH Golden Jubilee: జేఎన్‌టీయూలో చదివి అగ్రస్థానంలో ఉన్నోళ్లెవరో తెలుసా..?

author img

By

Published : Oct 3, 2021, 10:30 AM IST

JNTUH Golden Jubilee
JNTUH Golden Jubilee

దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయం... అత్యధిక సంఖ్యలో గుర్తింపు ఉన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు... ఏటా లక్ష మంది ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సులకు పట్టాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సాధించిన జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ 49 ఏళ్లు పూర్తి చేసుకుని శనివారం 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. దిగ్విజయంగా 49 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నేడు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో ప్రత్యేకతలు సాధించింది జేఎన్‌టీయూ. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

ఏటా వేలాది మందికి ఉన్నత విద్య అందిస్తున్న జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ 50వ వసంతంలోకి అడుగుపెట్టడంతో నేడు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ స్వర్ణోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబరు 2 వరకు వివిధ విభాగాల తరఫున దశలవారీగా కార్యక్రమాలు జరుపుతామని పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు భాగస్వాములు కానున్నట్లు వెల్లడించారు.

జేఎన్‌టీయూని 1972 అక్టోబరు 2న ప్రారంభించారు. తొలుత అనంతపురం, హైదరాబాద్‌, కాకినాడ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. 1992లో జేఎన్‌టీయూ చట్టాన్ని సవరిస్తూ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే హోదాను కల్పించారు. 2008 ఆగస్టు 18న ప్రత్యేక ఆర్డినెన్స్‌తో జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాన్ని నాలుగు వర్సిటీలుగా విభజించారు. జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురం, అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ఏర్పడ్డాయి. ప్రస్తుత క్యాంపస్‌ 89 ఎకరాల్లో ఏర్పాటైంది. 18 విభాగాలలో బీటెక్‌ కోర్సులు, 46 విభాగాల్లో ఎంటెక్‌, బీఫార్మసీ కోర్సులు, 9 విభాగాల్లో ఎంఫార్మసీ కోర్సులు, ఎంసీఏ, ఎంబీ, ఫార్మాడీ, ఫార్మాడీ(పీబీ) కోర్సులున్నాయి.

చదువుకున్న ప్రముఖులెందరో..

జేఎన్‌టీయూలో చదివిన విద్యార్థులెందరో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. సొంతంగా పరిశ్రమలు స్థాపించడమే కాకుండా ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా రాణిస్తున్నారు. ప్రస్తుత డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో మాజీ డీజీ అవినాశ్‌ చందర్‌, మాజీ డీజీ టెస్సీథామస్‌ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ అధికారులు జేఆర్‌కే రావు, పి.రాఘవేందర్‌రావు, గోపాల్‌రెడ్డి, వంశీ, బీపీవో సీఈవో విజయ్‌ రంగినేని, బీడీఎల్‌ మాజీ డైరెక్టర్‌ కె.దివాకర్‌, కేంద్ర ఎంఎస్‌ఎంఈ మాజీ సంచాలకుడు అర్వింద్‌ పట్వారి, డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.శ్రీనివాసరావు సహా ఎంతో మంది ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించారిక్కడే.

కాలానుగుణంగా కోర్సులు

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులను జేఎన్‌టీయూ తీసుకువచ్చింది. మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ వంటి సంప్రదాయ కోర్సులకు డిమాండ్‌ ఉన్న తరుణంలో సీట్లను అధికంగా కేటాయించింది. తర్వాత కంప్యూటర్‌ సైన్స్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా ఎక్కువ సీట్లు ఆ విభాగానికి కేటాయించింది. ఇందులోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ, ఐటీ వంటి కోర్సులను తీసుకు వచ్చింది. ఈ ఏడాది నుంచి కొత్తగా సిరిసిల్లలోనూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభించింది. ప్రత్యేకంగా టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పెట్టింది.

మరికొన్ని ప్రత్యేకతలు...

  • రాష్ట్రంలో బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం.
  • స్నాతకోత్సవ డిగ్రీల దరఖాస్తుకు ఆన్‌లైన్‌ సేవలు ప్రవేశపెట్టిన దేశంలో తొలి వర్సిటీ.
  • ఆన్‌లైన్‌ ఇంటర్నల్‌ పరీక్షల నిర్వహణ.
  • ఆన్‌స్క్రీన్‌ విధానంలో జవాబుపత్రాల మూల్యాంకనం.
  • దేశ విదేశాలకు ట్రాన్స్‌స్క్రిప్టు సేవల బట్వాడా
  • అంకుర సంస్థల ప్రోత్సాహానికి జె-హబ్‌ ఏర్పాటు.

మరింత పుంజుకుంటేనే..

ఆచార్యుల ఖాళీలు, పరిశోధనల్లో వెనుకబాటు, విదేశీ విద్యార్థులను ఆకట్టుకోలేకపోవడంతో కొన్నాళ్లుగా వర్సిటీ ప్రతిష్ఠ దిగజారుతోంది. ప్రస్తుత న్యాక్‌ హోదా త్వరలో ముగియనుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌-2021 ర్యాంకుల్లోనూ ఇంజినీరింగ్‌ కేటగిరీలో 62కే పరిమితమైంది. ఆచార్యుల పోస్టుల భర్తీ చేసి పరిశోధనలు, ప్రాంగణ నియామకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి:

TELUGU ACADEMY SCAM: పక్కా ప్రణాళికతోనే తెలుగు అకాడమీ నిధులు గోల్​మాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.