ETV Bharat / city

రైతులను ఆదుకునేందుకే ఉచిత పంటల బీమా: సీఎం

author img

By

Published : May 25, 2021, 4:05 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉద్ఘాటించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కోసమే రూ.83 వేల కోట్లు ఖర్చు చేయడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోపే ఇన్​పుట్ సబ్సిడీ పరిహారం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న సీఎం... ప్రతి రైతుకూ తోడుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

2020 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 15.15 లక్షల మంది రైతన్నలకు రూ.1,820.23 కోట్ల బీమా పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

62 శాతం మందికి ఉపాధి..

62 శాతం ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై జీవనం సాగిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయం ఆహార భద్రత ఇవ్వడమే కాకుండా 62 శాతం మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. రైతులు, రైతుకూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వీరి బాగోగుల కోసం గట్టిగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులందరికీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద పరిహారం అందిస్తున్నామని చెప్పారు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా... పారదర్శకంగా పరిహారం పంపిణీ చేస్తున్నామని, జాబితాను అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు సీఎం తెలిపారు.

పేరుకే పరిహారం ఫథకాలు ఉండేవి..

పంట నష్టానికి సంబంధించి 2018-19 ఏడాది రూ. 715కోట్లు, 19-20 ఏడాదికి రూ.1252 కోట్ల బకాయిలు వైకాపా ప్రభుత్వం రైతులకు చెల్లించిందని సీఎం వివరించారు. ఇప్పటి వరకు రూ.1968 కోట్ల బీమాను రైతులకు అందించామని, ఇవాళ్టి చెల్లింపులు రూ.1820 కోట్లు కలిపితే రూ.3788 కోట్లను రైతులకు పంట నష్టానికి బీమాగా చెల్లించినట్ల వివరించారు. గతంలో పేరుకే పరిహారం ఫథకాలు ఉండేవని, ఎప్పుడు, ఎవరికి ఎంత ఇస్తారో తెలిసేవి కాదని, ఇన్​పుట్ సబ్సిడీ వెంటనే అందేది కాదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్​లో నష్టం వస్తే అదే సీజన్​లో ఇన్​పుట్ సబ్సిడీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

నేరుగా రైతులకే...

2020లో పంట నష్టపోతే రూ.930 కోట్లు ఇన్​పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతులకు సీజన్ ముగిసేలోపే ఇచ్చామని సీఎం వెల్లడించారు. బీమా కోసం గతంలో రైతులు ఒక భాగం, రాష్ట్రం ఒక భాగం, కేంద్రం మరో భాగం చెల్లించేదని, ఎవరు ప్రీమియం చెల్లించకపోయినా అంతిమంగా రైతులే నష్టపోయేవారని వ్యాఖ్యానించారు. ఈ విధానంలో రైతులకు నష్టం జరుగుతుందని భావించి, రైతులపై భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం భరిస్తోందని సీఎం వివరించారు. ఈ క్రాప్​లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరా పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 23 నెలల కాలంలో అక్షరాలా రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం...

రాష్ట్రంలో ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తూ... అనుబంధంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. విత్తనం నుంచి ధాన్యం అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ రైతులకు అండగా ఉంటున్నామన్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.

రైతుకు భరోసా.. రైతు భరోసా కేంద్రాలు...

పంట చేతికి వచ్చినపుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు వ్యవహరిస్తున్నాయన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇస్తున్నామని వివరించారు. పాడితోనే రైతులకు అదనపు ఆదాయం కోసం అమూల్​తో ఒప్పందం చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లో కార్యకలాపాలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.

అందుకే అమూల్​తో ఒప్పందం..

గతంతో పోల్చితే లీటర్ పాలపై 5నుంచి 15 రూపాయల వరకు అదనంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి ఆర్బీకే కేంద్రాల్లో గిడ్డంగులు సహా ఇతర ఇతరత్రా సదుపాయాలు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయలు పరిహారం పెంచి అందిస్తున్నామని అన్నారు. పరిహారం అందించే కార్యక్రమం ప్రతి జిల్లాలో కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చనిపోయిన 130 మంది రైతులకు రూ.7 లక్షల చొప్పున పరిహారం అందించామని వెల్లడించారు.

2 లక్షల బోర్లు..

వైఎస్​ఆర్ జలకళ పథకం కింద రూ.4932 కోట్లతో 2 లక్షల బోర్లు వేయిస్తూ సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది తన నమ్మకమన్న సీఎం.. రైతులకు మరింత మేలు జరిగేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండీ... వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.