ETV Bharat / city

చంద్రబాబు డైరెక్షన్​లో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు: వెల్లంపల్లి

author img

By

Published : Aug 21, 2020, 5:13 PM IST

పండితులు, మత పెద్దలతో చర్చించే వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. వినాయక ఉత్సవాలపై ప్రతిపక్షాలు, ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

Endowments minister Vellampalli Srinivasa Rao
Endowments minister Vellampalli Srinivasa Rao

వినాయక చవితి పండగపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఖండించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే వినాయక చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు.

ఆరోపణలు తగవు...

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి... వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పండితులు, మత పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు అన్ని పండగలను ఇళ్లలోనే చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని సూచించారు.

ఐదు నెలలుగా రాలేదు...

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గత ఐదు నెలలుగా తన సొంత నియోజకవర్గానికి కూడా రాలేదని విమర్శించారు. దిల్లీలో కూర్చుని మాట్లాడటం కాదు.. అంత ప్రేమ ఉంటే సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ మండిపడ్డారు. రఘురామ కృష్ణరాజు.. చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం పూజలు చేసుకుని ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

కొవిడ్ బాధితులకు ఏ ఇబ్బంది రావొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.