ETV Bharat / city

GULAB EFFECT ON HYD: హైదరాబాద్​ను వణికించిన మూసీ వరద.. పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్​

author img

By

Published : Sep 28, 2021, 9:20 PM IST

హైదరాబాద్​ను వణికించిన మూసీ వరద
హైదరాబాద్​ను వణికించిన మూసీ వరద

హైదరాబాద్‌ నగరాన్ని గులాబ్‌ తుపాన్‌.. వణికించింది. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంగళూరు జాతీయ రహదారిపై అప్పా చెరువు వరద పోటెత్తింది. అటు గాజుల రామారంలో పలు కాలనీలు నీట మునిగాయి. వికారాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి వాగులో గల్లంతై చనిపోయాడు. ఇక భాగ్యనగర జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ నిండుకుండలా మారడంతో.. మూసీలోకి వరదను విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భాగ్యనగరాన్ని మళ్లీ వర్షం (HEAVY RAINS IN HYDERABAD) బెంబేలెత్తించింది. లోతట్టు ప్రాంతాల్లో వరద దృష్ట్యా.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇవాళ సెలవు ప్రకటించింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రాజేంద్రనగర్ నియోజవర్గంలోని గగన్​పహాడ్ వద్ద.. బెంగళూరు జాతీయ రహదారిపై.. అప్పా చెరువు వరద పోటెత్తింది. శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను.. ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఒక వైపుగానే వాహన రాకపోకలు సాగుతున్నాయి. విమానాశ్రయానికి వెళ్లాల్సిన వారు.. ఔటర్​ రింగ్​రోడ్డు మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. గగన్​పహాడ్​ వద్ద అప్పా చెరువును.. చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి పరిశీలించారు. చెరువు కట్టపై కలియ తిరుగుతూ... లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. చెరువు కట్టను ఆనుకుని ఉన్న పరిశ్రమ యజమానులతో చర్చించి.. తరలించే నిర్ణయం తీసుకుంటామని ఎంపీ తెలిపారు.

జలదిగ్బంధంలో పలు కాలనీలు..

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారం (GULAB CYCLONE EFFECT) పరిధిలోని.. ఓక్షిత్ ఎంక్లేవ్ కాలనీలోకి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతమైన ఈ కాలనీలోకి.. ఎగువ ప్రాంతంలోని చెరువు నీరు వచ్చి చేరుతోంది. దీంతో కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని కాలనీవాసులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్.. మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్.. వరద నీటిలోని ప్రాంతాలను పరిశీలించారు. గల్లీలన్నీ తిరిగి సమస్యను పరిష్కరించాలని.. అధికారులను డిమాండ్ చేశారు.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (HEAVY RAINS IN MEDCHAL) మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ప్రధాన రహదారిపై మోకాలు లోతు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 13 ఏళ్లుగా అవస్థలు పడుతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదుచేసినా.. సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.

ఆయా కాలనీల్లో అవస్థలు..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్​, మేడిపల్లి, రామంతాపూర్‌, ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందడటంతో అక్కడకు సమీపంలో రోజుకో కొత్త కాలనీ ఏర్పాటవుతోంది. అక్కడ కాలనీల్లో కనీస వసతులు లేక.. వర్షాకాలం వచ్చిందంటే వారికి అవస్థలు ప్రారంభమవుతున్నాయి. మూసీ కాలువలను ఆనుకొని లేఅవుట్ల తయారు చేసి ఇంటి స్థలాలుగా అమ్మేశారు. దీంతో హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే వర్షపునీరు మూసీ కాలువ వెంట ప్రవహించకుండా కొత్తగా ఏర్పడ్డ కాలనీలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఆయా కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్​..

హైదరాబాద్​ జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​కు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో.. హిమాయత్​సాగర్​ 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మూసి నదిలోకి నీటికి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్​సాగర్​ జలాశయం 4 గేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్​సాగర్​ దిగువన ఉన్న ఓఆర్​ఆర్​ సర్వీసు రోడ్డు వంతెనపై రాకపోకలను నిలిపేశారు. జలశయాల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. హిమాయత్​సాగర్​ గేట్లను ఎత్తివేయడంతో మూసీలోకి వరద నీరు వస్తోంది. ఫలితంగా అక్కడ నుంచి పూరానాపూల్​ వద్ద రోడ్డుపైకి నీళ్లు రావడం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే కౌసర్​ మొయినుద్దీన్​ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

పునరావాస కేంద్రాలు ఏర్పాటు..

మూసీకి వరద ఉద్ధృతి దృష్ట్యా మూసారాంబాగ్ వంతెనను అధికారులు మూసివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్​పేట్​-మలక్​పేట్​ మధ్య రాకపోకలను నిలిపేశారు. అంబర్​పేట్​ పరిధిలో రెండు, చాదర్​ఘాట్​ శంకర్​నగర్​ మసీదులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. సుమారు 40 కుటుంబాలను తరలించారు. వరద ఉద్ధృతి దృష్ట్యా చాదర్​ఘాట్​ వంతెనపై తొలుత రాకపోకలను నిలిపేసిన పోలీసులు.. అనంతరం రద్దీ దృష్ట్యా రాకపోకలను పునరుద్ధరించారు. వరద ఉద్ధృతి మళ్లీ పెరిగితే.. నిలిపేయనున్నట్లు తెలిపారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ (high alert in hyderabad) ప్రకటించారు. పీర్జాదిగూడలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. జియాగూడ వద్ద మూసీ నది (heavy water inflow to musi river)ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

వరద ఉద్ధృతి నేపథ్యంలో మూసారాంబాగ్‌ లోతట్టు ప్రాంత వాసులను తరలించారు. మేయర్‌ పర్యవేక్షణలో 60 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు పంపారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్‌కు ఇప్పటి వరకు 448 ఫిర్యాదుల వచ్చాయన్ అధికారులు.. వర్షపు నీటి నిల్వ, చెట్లు విరిగిపోవడంపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కారించినట్లు చెప్పారు.

నీట మునిగిన పంట పొలాలు..

భారీ వర్షాలు, వరదలకు రంగారెడ్డి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్​పల్లి మండలాల పరిధిలోని.. ఈసీ, మూసీ వాగు ఉద్ధృతికి పంటపొలాలు నీట మునిగాయి. చేవెళ్లలోని దేవరంపల్లి, మొయినాబాద్​లోని అందాపూర్ వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగు పక్కనే ఉన్న పంట పొలాలు నీట మునిగి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మొయినాబాద్ మండలం అందాపూర్ వద్ద వరదకు పంటలు దెబ్బతిన్నాయి.

బైక్​తో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి..

వాగుదాటే క్రమంలో వికారాబాద్ జిల్లా పులుసుమామిడికి చెందిన ఇషాక్​పాషా అనే వ్యక్తి బైక్​తో పాటు గల్లంతయ్యాడు. హైదరాబాద్​లో బోర్ వైండింగ్ పనిచేసే ఐజాక్.. పని ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిద్ధులూరు నుంచి పులుసుమామిడి వైపు వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. బైక్​తో పాటే గల్లంతయ్యాడు. వెంటనే అక్కడ పహారా కాస్తున్న పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే కొట్టుకుపోయాడు. ఉదయం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా.. వాగు సమీపంలో మోటార్ సైకిల్ లభ్యమైంది. గల్లంతైన ఇషాక్​పాషా మృతదేహం అత్తాపూర్ గ్రామ సమీపంలోని వాగులో లభ్యమైంది. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పరిశీలించారు. వాగు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయించారు.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.