ETV Bharat / city

ఎంత ఖరీదైన వైద్యమైనా ఆరోగ్యశ్రీ వర్తించాలి: సీఎం జగన్

author img

By

Published : Nov 10, 2020, 8:32 PM IST

ఆరోగ్యశ్రీలో అన్ని వైద్య ప్రక్రియలు చేర్చిన దృష్ట్యా వెయ్యి రూపాయలు దాటే ప్రతీ వైద్యాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బోన్‌ మారో, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చినందున ఆ మేరకు రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు. ఎంత ఖరీదైన వైద్యం అయినా ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలని సూచించారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులు పూర్తి ప్రమాణాలు పాటించాలని, ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు కూడా పొందాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Cm jagan
Cm jagan

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మంగళవారం సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్య శ్రీ సీఈవో మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమావేశంలో అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకి చూపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.35 కోట్ల స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను క్యూఆర్‌ కోడ్‌తో సహా జారీ చేశామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకంలో హైదరాబాద్‌లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను గుర్తించామని, వాటిలో 716 చికిత్సలు అందుతున్నాయని సీఎంకు తెలిపారు. సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ మార్పిడి ఆరోగ్య శ్రీలో

బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ మార్పిడి వంటి అత్యాధునిక, ఖరీదైన వైద్యం కూడా పథకంలో వర్తింపజేయాలని, ఆ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రులను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. రూ.1000 ఖర్చు దాటిన ప్రతీ వైద్యం తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ పథకంలో అమలు కావాలని, అదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ ప్యానెల్‌లో ఉన్న ప్రతి ఆస్పత్రి పూర్తి ప్రమాణాలు పాటించాలని, నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డు ఫర్ హాస్పిటల్స్..(ఎన్​ఏబీహెచ్​) గుర్తింపు పొందాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఆ గుర్తింపు పొంది ఉండాలని నిర్దేశించారు.

ఏఎన్​ఎంలు సంధానకర్తలు

ఆరోగ్య శ్రీకి గ్రామాల్లో ఏఎన్​ఎం​లు సంధానకర్తలుగా ఉండాలని, అందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలని, వ్యాధులపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ట్యాబ్‌ల వినియోగంపై ఏఎన్‌ఎంలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే రోగి దగ్గర వివరాలు తీసుకుని, టెలి మెడిసిన్‌ ద్వారా వైద్య నిపుణులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పొందాలన్నారు. కొవిడ్‌కు సంబంధించి టెలి మెడిసిన్‌ కొనసాగుతోందని, ఇతర వ్యాధులకు కూడా ఆ సదుపాయాన్ని విస్తరించాలన్నారు. టెలి మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను ఇంకా బలోపేతం చేయాలని, అక్కడ రోజంతా వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.

మంచి ఆహారం, రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా

రోగులు, ఏఎన్‌ఎంలు ఫోన్‌ చేస్తే వెంటనే సమాధానం చెప్పాలన్నారు. రోగి నెంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని ఆ వెంటనే కాల్‌ సెంటర్‌ కాల్‌ బ్యాక్‌ చేయాలని సూచించారు. అన్నిచోట్ల ఇరువైపులా సంభాషణలు ఉండాలన్నారు. అందుకు అవసరమైన నెట్‌ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంచి ఆహారం, డిశ్చార్జి తర్వాత రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా.. ఈ మూడు ఆరోగ్యశ్రీ పథకం ప్యానెల్‌లో ఉన్న ప్రభుత్వ, ఎంపానల్ ఆస్పత్రులలో పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. ఆరోగ్యమిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లు రోగులకు పూర్తి స్థాయిలో సేవలందించాలని నిర్దేశించారు.

ఇదీ చదవండి

రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చేశారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.