ETV Bharat / city

AP CID: చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు

author img

By

Published : Oct 1, 2022, 4:10 PM IST

Updated : Oct 2, 2022, 7:23 AM IST

AP CID police
ఏపీ సీఐడీ

తెదేపా నేత చింతకాయల విజయ్‌ నివాసంలో సీఐడీ పోలీసులు హల్‌చల్‌ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లోకి చొరబడిన 15 మంది పోలీసులు....సోదాలు పేరిట కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారు. వ్యక్తిగత సహాయకుడిని కొట్టడమేగాక...విజయ్‌ ఐదేళ్ల కుమార్తెను బెదిరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై చంద్రబాబు సహా.. తెదేపా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌ సతీమణి భార్య భారతిపై అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ.. ఐటీడీపీ నేత చింతకాయల విజయ్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని విజయ్‌ నివాసానికి వచ్చిన పోలీసులు.. బ్యాంకు అధికారులమంటూ హడావుడి చేసి అనధికారికంగా ఇంట్లో సోదాలు చేశారని మండిపడ్డారు. పోలీసులు తనని కొట్టడమేగాక.. విజయ్ ఐదేళ్ల కుమార్తెను బెదిరించారని ఆయన వ్యక్తిగత సహాయకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి వేళ్లారు. ఈనెల 6న మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకాకుంటే...అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు .

విజయ్‌ను పట్టుకుని తమతో తీసుకెళ్లేందుకే వచ్చిన సీఐడీ పోలీసులు.. ముందురోజే ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయమే రెండు కార్లలో వచ్చిన 14 మంది సీఐడీ పోలీసులు.. వాహనాలు దూరంగా నిలిపివేసి పరిసరాలను పరిశీలించి వెళ్లారు. శనివారం ఉదయం ఒక్కసారిగా 14,15 మంది ఇంట్లోకి ప్రవేశించటంతో విజయ్‌ కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సెల్లార్‌లో ఉన్న విజయ్‌ వ్యక్తిగత సహాయకుణ్ని బెదిరించారు. చెంప మీద కొట్టి తాము బ్యాంకు అధికారులమంటూ ఇంటి తలుపులు తెరిపించారు. పడకగది, వంటగది, అల్మరాల్లో తనిఖీలు చేశారని, ఇంట్లో పిల్లలు, మహిళలున్నా చూడకుండా హల్‌చల్‌ చేశారని, అసలు వచ్చింది పోలీసులా కాదా అనే విషయం తెలియడం లేదని విజయ్‌ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహించాలని ఒత్తిడి చేశారంటూ ఆరోపించారు. సాయంత్రం మరోసారి వచ్చి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీశారు. ఫుటేజ్‌ కావాలంటూ హడావుడి చేశారని తెలిసింది. విజయ్‌ ఇంట్లోకి సీఐడీ అధికారులు చొరబాటుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు .

సీఎం సతీమణి భారతి గురించి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నందునే విజయ్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

ఏపీ సీఐడీ నిబంధనలు అతిక్రమిస్తోంది. ఏపీ సీఎం ఇంట్లో చిన్న పిల్లలు లేరా?. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారు?. ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. చట్టప్రకారం వ్యవహరిస్తే ఎవరైనా సహకరిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులా?. జగన్ దోపిడీని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు?. నోటీసులు ఇవ్వకుండానే ఇంటి గోడ పడగొట్టారు. జగన్‍పై జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉంది." -అయ్యన్నపాత్రుడు

ఏపీ సీఐడీ

ఇవీ చదవండి:

Last Updated :Oct 2, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.