ETV Bharat / city

Amaravathi JAC: ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం: అమరావతి పరిరక్షణ సమితి ఐకాస

author img

By

Published : Mar 6, 2022, 7:59 AM IST

Amaravathi JAC fires on AP government
ప్రభుత్వ దుష్ప్రచారం తిప్పికొడతాం

Amaravathi JAC: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో న్యాయానికి న్యాయం జరిగిందని.. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు తిరుపతిలో అన్నారు. ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజల విజయం. ప్రస్తుతం ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ అమరావతి అభివృద్ధి వైపు దృష్టి సారించాలనే నినాదంతో ముందుకెళతామని స్పష్టం చేశారు.

Amaravathi JAC: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో న్యాయానికి న్యాయం జరిగిందని.. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి, కోకన్వీనర్‌ తిరుపతిరావు తిరుపతిలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల వల్లే ఈ మధ్య కాలంలో న్యాయం బతికి ఉందని శివారెడ్డి తెలిపారు.

‘ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజల విజయం. ప్రస్తుతం ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ అమరావతి అభివృద్ధి వైపు దృష్టి సారించాలనే నినాదంతో ముందుకెళతాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మూడుముక్కలాట ఆపాలి. ఒక ముంపు ప్రాంతంలో అంతా పెయిడ్‌ ఆర్టిస్టులున్నారని మంత్రులు, సలహాదారులు పేర్కొనడం విడ్డూరం. విస్పష్టమైన తీర్పు చూసి మాట్లాడుతున్నారంటే వారు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో స్పష్టమవుతోంది. అమరావతి కట్టాలంటే రూ.లక్ష కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తామంటున్నారు. అది గ్రీన్‌ఫీల్‌్్డ, సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్‌ రాజధాని. ఆదాయం సమకూరుతుంది. దీంతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయవచ్చు. 2030నాటికి ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు తెచ్చిపెట్టే ప్రాజెక్టు అది. 34వేల ఎకరాలు ప్రభుత్వానికి ఎప్పుడైతే ఇచ్చామో.. అప్పుడే అది రాష్ట్ర ప్రజల సొత్తు. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. రైతుల ప్లాట్లుపోను సుమారు 9వేల ఎకరాల మిగులు భూమి ఉంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మనపై అవాకులు చవాకులు పేలుతున్నారు. పూర్వం ఇక్కడ ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనవచ్చు. అది రివర్స్‌ అయింది. అక్కడ ఎకరం అమ్మి మన వద్ద పదెకరాలు కొనవచ్చని అంటున్నారు. ఆ మాటలకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు సిగ్గుపడాలి. రూ.లక్ష కోట్లు కావాలని అంటున్న సీఎం సుమారు 3నుంచి 4లక్షల కోట్లు పప్పుబెల్లాల్లా పంచేశారు. ఆయన పదవి చేపట్టాక ఒక్కసారైనా అమరావతిని వీక్షించారా?’ అని ప్రశ్నించారు. ‘ఇదిలాగే కొనసాగిస్తే 2024లో 151 సీట్లు కాదు.. నీ సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి వస్తుంది’ అని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘మూడేళ్లపాటు రైతులు పడిన బాధలకు న్యాయస్థానం వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తే అది వికారం పుట్టించేలా ఉందంట. అంటే తీర్పుపై వాళ్ల కడుపుమంట ఎంతలా ఉందో తెలుస్తోంది’ అని కోకన్వీనర్‌ తిరుపతిరావు అన్నారు.

‘అమరావతి రియల్‌ఎస్టేట్‌ చేయడానికి అని మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యేల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు లేరా? చేసేది తప్పని చెబితే మారి ప్రజలకు మంచి చేయండి. అమరావతి తీర్పును దేశవ్యాప్తంగా చరిత్రాత్మకమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బతుకుతున్నారంటే కేవలం న్యాయస్థానాల వల్లే. అవి లేకపోతే ఆంధ్ర ప్రజలు వలసవెళ్లాల్సి వచ్చేది’ అని అన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌, తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌రాయల్‌, సీపీఐ నాయకుడు జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

MLA letter to CM Jagan: 'రాజ్యాంగ వ్యవస్థల పరిధులపై చర్చ జరగాలి'.. సీఎం​కు శ్రీకాకుళం ఎమ్మెల్యే లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.