ETV Bharat / city

బంజారాహిల్స్ భూవివాదం కేసులో 58 మంది అరెస్టు.. ఏ-5గా టీజీ వెంకటేశ్‌

author img

By

Published : Apr 19, 2022, 7:18 AM IST

Banjarahills Land Issue
Banjarahills Land Issue

Banjarahills Land Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోని బంజాహిల్స్‌లో కోట్ల విలువైన భూవివాదం కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే 58 మందిని పోలీసులు అరెస్టు చేయగా... మరికొందరు పరారీలో ఉన్నారు. సర్వే నంబరు 403లో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందిందేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనూహ్యంగా రిమాండ్ రిపోర్టులో ఏపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేరు ఉంటడంతో కేసు ఆసక్తికరంగా మారింది.

Banjarahills Land Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నిత్యం ఏదో ఒక స్థలవివాదం వెలుగులోకి వస్తోంది. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వద్ద... సర్వే నంబర్ 403లోని 2248గజాల భూవివాదం సంచలనం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వద్ద సర్వే నంబర్ 403లోని 2248 గజాల భూమిలో ఆదివారం సుమారు 80 మంది వ్యక్తులు అక్కడికి వచ్చి భద్రతా సిబ్బందిపై దాడి చేసి భూమిలో సామగ్రి దించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు.

ప్రధాన నిందితులుగా... టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ, సుభాష్ పులిషెట్టి, మిథున్ కుమార్ అల్లులను చేర్చారు. మరో 75 నుంచి 80 మంది ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ పేర్కొన్నారు. అయితే వైద్య పరీక్షల కోసం వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో సుభాష్, మిథున్ కలిసి తప్పించుకున్నారు. మిగిలిన 58 మందిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.

'ఆ భూమిపై మాకు అధికారం ఉంది. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేను దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాను. బంజారాహిల్స్ భూమిని 25 శాతం కొనుగోలు చేశాం. మిగతా 75 శాతం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏ సర్బన్ అనే కంపెనీ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తోంది. కోర్టుకు వెళ్తే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మా స్థలంలో ఓ కార్యక్రమం నిమిత్తం వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవు.'- విశ్వ ప్రసాద్, ఏ-1 నిందితుడు

ఆ భూమి ప్రభుత్వానిదే...

'బంజారాహిల్స్ సర్వే నంబరు 403లోని 2 ఎకరాల 5 గంటల భూమి పూర్తిగా ప్రభుత్వానిదే. ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. 2005లో అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా మలేసియన్ కంపెనీ ఐఓఐసీతో ఒప్పందం చేసుకుంది. ఏపీ జెమ్స్‌ అండ్‌ జూవెల్లరీస్‌ పార్కు కోసం ఈ ఒప్పందం జరిగింది. ఇందుకోసం భూమిని కేటాయించింది. గతంలో ఫినిక్స్ టెక్ టవర్స్ లిమిటెడ్ అనే సంస్థ వద్ద ఐఓఐసీ అప్పు చేసింది. వాటిని తీర్చనందకు ఫినిక్స్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో భూమి తీసుకున్న మలేసియన్ కంపెనీ అభివృద్ధి చేయకుండా మధ్యలోనే వదిలేసింది. నిబంధనల ప్రకారం అది ప్రభుత్వ భూమి.. త్వరలోనే భూమిని స్వాధీనం చేసుకుంటాం.'-శ్రీనివాస్ రెడ్డి, షేక్‌పేట్ తహశీల్దార్

టీజీ వెంకటేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు..: ఈ కేసు రిమాండ్ రిపోర్టులో రాజ్యసభ్య సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేరును ఏ-5గా చేర్చారు. దీనిపై టీజీ వెంకటేశ్‌ సోదరుడు టీజీ రాఘవేంద్ర స్పందించి పశ్చిమ మండల డీసీపీకి లేఖ రాశారు. టీజీ విశ్వప్రసాద్‌కు సంబంధించిన భూవివాదంతో తన సోదరుడు టీజీ వెంకటేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలిసిన వారే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వప్రసాద్ తమకు దూరపు బంధువని.. అతడి ఇంటిపేరు కూడా టీజీ అని తెలిపారు. అంతేగానీ విశ్వప్రసాద్‌తో ఎలాంటి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. వెంకటేశ్‌ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తల్ని ఆయన కుమారుడు టీజీ భరత్ ఖండించారు.

ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేశాడని యువకుడి మర్మాంగంపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.