ETV Bharat / city

కరోనా దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. 40-50 శాతం గైర్హాజరు

author img

By

Published : Jan 26, 2022, 7:08 PM IST

కరోనా దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. సుమారు 40 నుంచి 50 శాతం మంది విద్యార్థులు బడికి గైర్హాజరవుతున్నారు. వైరస్ తొలి రెండు విడతల్లో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కొవిడ్ భయంతో పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు.
40 to 50 percent students absent to school due to corona
40 to 50 percent students absent to school due to corona

రాష్ట్రంలో కొవిడ్ కేసుల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపడం సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే మొగ్గు చూపుతుండటంతో విద్యార్థులకు ఏం చేయాలో తోచని పరిస్థితి. చదువులో వెనకబడతారని బడికి పంపితే.. ఎక్కడ కరోనా సోకుతుందో అని తల్లిదండ్రుల ఆందోళన. ఇలా మహమ్మారి భయంతో గుంటూరు జిల్లాలో సగం మంది విద్యార్థులు పాఠశాలలకే హాజరుకాని దుస్థితి. చేసేదేమీ లేక వచ్చినవారితోనే ఉపాధ్యాయులు తరగతులు కానిచ్చేస్తున్నారు.

కరోనా దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. 40-50 శాతం గైర్హాజరు

విద్యార్థుల హాజరు తగినంత లేకపోతే... అమ్మఒడి వంటి పథకాలు నిలిచిపోతాయనే భయంతో మరికొందరు పిల్లల్ని బడికి పంపుతున్నారు. పోనీ వీరికైనా సంరక్షణ ఉందంటే అంతంతమాత్రమే. కరోనా తొలినాళల్లో తీసుకున్న జాగ్రతలు.. ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదు. చాలా పాఠశాలల్లో ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్ స్రీన్లు లేవు. బడుల్లో శానిటేషన్ కూడా చేయడం లేదు. వైరస్ వ్యాప్తి వేళ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. వారి ఆరోగ్య భద్రతకు ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు.

ఉపాధ్యాయులూ సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదుగురు గురువులకు కరోనా సోకింది. బొప్పూడి, కారంపూడి, గొట్టిపాడు, వినుకొండ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. విద్యార్థులు పెద్దగా రాకపోయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలు నడుపుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో.. పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని.. లేకుంటే ప్రత్యామ్నాయ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ap corona cases today: రాష్ట్రంలో కొత్తగా 13,618 కరోనా కేసులు, 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.