ETV Bharat / business

బిగ్​బుల్ రాకేశ్ ఝున్​ఝున్​వాలా హఠాన్మరణం

author img

By

Published : Aug 14, 2022, 9:20 AM IST

Updated : Aug 14, 2022, 1:31 PM IST

Rakesh Jhunjhunwala passes away
Rakesh Jhunjhunwala passes away

09:19 August 14

బిగ్​బుల్ రాకేశ్ ఝున్​ఝున్​వాలా హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్​ఝున్​వాలా కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఝున్​ఝున్​వాలా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలోని బీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని 'ఆకాశ ఎయిర్' వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్​లోని రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఆయన.. ముంబయిలో పెరిగారు. వీరి పూర్వీకులది రాజస్థాన్​లోని ఝున్​జునూ. ఝున్​ఝున్​వాలా తండ్రి ఆదాయ పన్ను శాఖలో కమిషనర్​గా పనిచేసేవారు. సెడెన్హమ్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన రాకేశ్ ఝున్​ఝున్​వాలా.. అనంతరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యారు.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్​గా ఝున్​ఝున్​వాలా అందరికీ సుపరిచితులు. భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల దృక్ఫథంతో వ్యవహరించేవారు. బుల్ మార్కెట్​ను విశ్వసించేవారు. ఆయన కొనుగోలు చేసిన షేర్లలో చాలా వరకు కాసుల వర్షం కురిపించాయి. ఆర్ఏఆర్ఈ ఎంటర్​ప్రైజెస్ పేరుతో ప్రైవేటు స్టాక్ ట్రేడింగ్ కంపెనీని నడిపించారు. ఆయన ఆస్తి విలువ రూ.46వేల కోట్లు. దీంట్లో సింహ భాగం స్టాక్‌ మార్కెట్‌ ద్వారానే సంపాదించారు. 'వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా' అని కూడా ఝున్‌ఝున్‌వాలాను పిలుస్తుంటారు. ఇటీవలే ప్రారంభమైన 'ఆకాశా ఎయిర్' విమానయాన సంస్థ యజమాని ఈయనే.

మోదీ విచారం
రాకేశ్ ఝున్​ఝున్​వాలా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగానికి ఆయన ఎనలేని కృషి చేశారని మోదీ కొనియాడారు. దేశ పురోగతి విషయంలో సానుకూలంగా ఉండేవారని చెప్పారు. 'ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అని మోదీ ట్వీట్ చేశారు.

Last Updated : Aug 14, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.