ETV Bharat / bharat

మోదీ సలహాతో డైట్ మార్చిన యువ నేత.. బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు!

author img

By

Published : Jul 25, 2022, 6:03 PM IST

"కాస్త బరువు తగ్గు.." అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహా ఆ యువ నేత జీవనశైలినే మార్చేసింది. ప్రధాని సూచనను సీరియస్​గా తీసుకున్న ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్.. సన్నబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అవేంటో మీరూ చూడండి.

Tejashwi becomes health conscious
Tejashwi becomes health conscious

మోదీ సలహాతో డైట్ మార్చిన యువ నేత

ప్రధాని నరేంద్ర మోదీ సలహాతో ఫిట్​నెస్​పై దృష్టి పెట్టారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్​జేడీ యువ నేత తేజస్వీ యాదవ్. బరువు తగ్గేందుకు గత రెండు వారాలుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. క్రికెట్ ఆడుతూ, సైక్లింగ్ చేస్తూ, జీపును లాగుతూ.. రోజుకు 2-3 గంటలపాటు వ్యాయామం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లనూ పూర్తిగా మార్చేసి.. "తేజస్వీ 2.0"గా మారేందుకు యత్నిస్తున్నారు.

పెళ్లి తెచ్చిన మార్పు!
నిజానికి తేజస్వీ యాదవ్ ఒకప్పుడు సూపర్ ఫిట్. ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. 2009లో ఝార్ఖండ్​లో రాష్ట్ర స్థాయి క్రికెటర్. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆడారు. ఐపీఎల్​లోనూ దిల్లీ డేర్​డెవిల్స్​ జట్టు సభ్యుడు. తర్వాత గాయం కారణంగా క్రికెట్​ను వీడారు. అనంతరం రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

On PM's advice Tejashwi becomes health conscious
క్రికెట్ ఆడుతున్న తేజస్వీ

తేజస్వీ మంచి భోజన ప్రియుడు. గ్రిల్డ్​ చికెన్, ఫిష్ ఫ్రై, మటన్​ను ఇష్టంగా లాగించేస్తారు. చాకొలేట్​ షేక్స్​ అంటే మహా ప్రీతి. వీటికి తోడు.. పెళ్లాయక తేజస్వీ శరీరంలో మరింత మార్పు వచ్చింది. అప్పటి వరకు 75 కిలోల బరువున్న ఆయన.. కాస్త లావయ్యారు. బరువు 85 కిలోలకు చేరింది.

Tejashwi becomes health conscious
తేజస్వీ యాదవ్

మోదీ మాటతో...
జులై 12న బిహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. పట్నా ఇందుకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ఈ కార్యక్రమంలో తేజస్వీ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఆర్​జేడీ యువ నేతతో కాసేపు మాట్లాడారు మోదీ. లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పనిలో పనిగా.. "కాస్త బరువు తగ్గు" అని తేజస్వీకి సలహా ఇచ్చారు ప్రధాని.

మోదీ సలహాను చాలా సీరియస్​గా తీసుకున్నారు తేజస్వీ. ఎలాగైనా స్లిమ్​గా అవ్వాలని నిర్ణయించుకున్నారు. భార్య రాజశ్రీ కూడా ఆయన్ను ప్రోత్సహించింది. అందుకు తగినట్లుగా లైఫ్​ స్టైల్​ను మార్చుకున్నారు తేజస్వీ. ఆయన సన్నిహితులన చెప్పిన దాని ప్రకారం... ప్రస్తుతం తేజస్వీ మిఠాయిలు, నూనె ఎక్కువగా ఉండే వంటకాలు తినడం లేదు. ఎక్కువగా సాలడ్స్ తీసుకుంటున్నారు. నూనె, మసాలా, కొవ్వు తక్కువగా ఉండే ఆహారమే తింటున్నారు.

డైట్​తోపాటు వ్యాయామం డోసు కూడా పెంచారు తేజస్వీ. పట్నాలోని తన నివాసంలో రోజూ సైక్లింగ్ చేస్తున్నారు. క్రికెట్ ఆడుతున్నారు. లాలూ ప్రసాద్ గతంలో ఉపయోగించిన పాత జీపును లాగుతూ చెమటలు చిందుస్తున్నారు. సంబంధిత వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. "కొద్ది నెలల్లోనే ఆయన బరువు తగ్గుతారు. త్వరలోనే మీరు సరికొత్త తేజస్వీని చూస్తారు" అని చెప్పారు ఆయన సన్నిహితులు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.