ETV Bharat / bharat

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

author img

By

Published : May 10, 2023, 3:20 PM IST

Updated : May 11, 2023, 7:35 AM IST

krmb
krmb

15:15 May 10

కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీకి ఎలాంటి వాటా ఖరారు చేయని కేఆర్‌ఎంబీ

కేంద్రం చెంతకు చేరిన కృష్ణా జలాల్లో నీటి వాటా అంశం

KRMB not Finalized Share Krishna Water AP and TS : హైదరాబాద్‌ జలసౌధలో నిన్న సుదీర్ఘంగా జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు 17వ సమావేశం తీవ్ర వాదోపవాదాల మధ్య కొనసాగింది. బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్​సీ మురళీధర్, ఏపీ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్​సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. 22 అంశాలున్న ఎజెండాపై జరిగిన ఈ సమావేశంలో అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తాం: బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వినియోగించుకొంటుండగా, వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని తెలంగాణ కోరింది. దీనిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని ఛైర్మన్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చేవరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుంది. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. 2022-23వ నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలన్న తెలంగాణ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. 34% నీటినే పూర్తిగా వినియోగించుకోలేదని ఏపీ ప్రతినిధులు ప్రస్తావించగా... తమ వాటాలో మిగిలితే కొత్త ప్రాజెక్టులకు వినియోగించుకుంటామని తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొనేలా 2015లో అవగాహన కుదిరింది. నాటి నుంచి ప్రతి ఏడాది అదే పద్ధతి కొనసాగుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లనుంది.

ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో అప్పగించం: కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలన్న అంశంపై ఏపీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, తెలంగాణ అంగీకరించడమే ఆలస్యమని బోర్డు పేర్కొంది. ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదని తెలంగాణ స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ 34 టీఎంసీలకన్నా ఎక్కువ డ్రా చేసుకోకుండా బోర్డు నియంత్రించగలిగితేనే ప్రాజెక్టులను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అనుమతులు సాధించాల్సిన, కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి మరింత గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జులై 15 నాటికే అనుమతులు తీసుకునే గడువు ముగుస్తున్నందున మరికొంత గడువు కోరుతూ రెండు రాష్ట్రాల కార్యదర్శులు లేఖ రాయాలని నిర్ణయించారు. రాజోలి బండ మళ్లింపు పథకం - ఆర్డీఎస్ ఆధునికీకరణను పూర్తిచేయాలని తెలంగాణ కోరింది. ఈ పనులకు సంబంధించి మూడు నెలల్లో సీడబ్ల్యూపీఆర్​ఎస్ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. 24 లక్షలతో అధ్యయనం చేయించి ఏయే పనులు చేయాలనేది గుర్తించాలని బోర్డు నిర్ణయించింది. ఏపీ కూడా సహకరిస్తామందని.. కుడి కాలువ నిర్మాణాన్ని ఏపీ చేపడుతోందని తెలంగాణ చెప్పగా... ప్రస్తుతం అక్కడ పనులేవీ జరగడం లేదని బోర్డు తెలిపింది.

సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్‌ పనులపై ఏపీ అభ్యంతరం: శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ఇష్టారీతిన విద్యుదుత్పత్తి చేస్తోందని, అడ్డుకోవాలని బోర్డును ఏపీ కోరింది. అవసరాలకు అనుగుణంగానే గతంలో ఉత్పత్తి చేయాల్సి వచ్చిందని పేర్కొన్న తెలంగాణ... ఈ ప్రాజెక్టు నుంచి ఏపీ 34 టీఎంసీలు డ్రా చేసుకునేందుకు కట్టుబడి ఉంటే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. తెలంగాణ నిర్మిస్తున్న సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్‌ పనులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులను బోర్డు ముందు ఉంచాలని ఏపీ డిమాండ్‌ చేయగా... కేవలం తాగునీటికి మాత్రమే ఈ పథకం నిర్మిస్తున్నామని తెలిపింది. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలని బోర్డు నిర్ణయించింది. అనుమతులు లేకుండానే పాలమూరు- రంగారెడ్డి పనులు చేస్తున్నారని, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే జలాల్లో 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టైబ్యునల్‌ ముందు విచారణ కొనసాగుతున్నందున బోర్డులో చర్చించడం సరికాదని తెలంగాణ పేర్కొంది. పోలవరం మళ్లింపు జలాలను సాగర్‌ ఎగువన వినియోగించుకోవచ్చనే నిర్ణయాన్నే అమలు చేస్తున్నట్లు తెలంగాణ పేర్కొంది.

వచ్చే బోర్డు సమావేశంలో ఆర్‌ఎంసీ నివేదికపై చర్చ: కృష్ణా జలాల వినియోగాన్ని తేల్చేందుకు టెలీమెట్రీ సెన్సార్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. పోతిరెడ్డిపాడు దిగువన కూడా వెంటనే ఏర్పాటు చేయాలని సూచించింది. బోర్డుకు రెండు రాష్ట్రాలు కలిపి 23 కోట్లు ఇస్తే ఈ ఏడాది రెండో దశ కింద టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తామని, మూడో దశ కింద పోతిరెడ్డిపాడు ఆవల కూడా ఏర్పాటు చేస్తామని బోర్డు సూచించింది. రవికుమార్‌ పిళ్లై కన్వీనర్‌గా బోర్డు నుంచి ఇద్దరు, రెండు రాష్ట్రాల నుంచి నలుగు సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికపై బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. కమిటీ బాధ్యతలను కొత్తగా నియామకమైన సభ్యుడు అజయ్‌కుమార్‌ గుప్తాకు అప్పగించారు. నెల వ్యవధిలో పాత కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఛైర్మన్‌కు నివేదిక ఇవ్వాలని ఆయనకు సూచించారు. వచ్చే బోర్డు సమావేశంలో ఆర్‌ఎంసీ నివేదికపై చర్చించాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 11, 2023, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.