ETV Bharat / bharat

మానవరహిత యుద్ధ విమానం.. డీఆర్​డీఓ ప్రయోగం సక్సెస్​

author img

By

Published : Jul 1, 2022, 10:56 PM IST

సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో.. భవిష్యత్తు యుద్ధాలు కేవలం యంత్రాల మధ్యే జరుగుతాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని సూపర్‌ పవర్‌ దేశాలు ఇప్పుడు మానవరహిత యుద్ధ వాహనాలపై దృష్టిపెట్టాయి. భారత్‌ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) మూడు అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేసింది. ఇటీవల వాటిని విజయవంతంగా పరీక్షించింది.

drdo test autonomous flight
drdo test autonomous flight

DRDO test autonomous flight: ఆధునిక యుద్ధ తంత్రాలను దృష్టిలో పెట్టుకొని భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) దేశీయంగా అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మానవ రహిత యుద్ధ విమానాలపై పరిశోధనలు ప్రారంభించిన డీఆర్‌డీఓ తాజాగా అరుదైన ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానమైన ఆటోనామస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ ఆధారంగా తొలి మానవరహిత యుద్ధ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో గల ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ మానవరహిత విహంగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. పూర్తి స్వయంచలితంగా ఎగిరే ఈ యుద్ధ విమానం కచ్చితమైన ఎత్తులో టేకాఫ్‌ అవడంతో పాటు నావిగేషన్‌., స్మూత్‌ టచ్‌డౌన్‌ వంటివి సమర్థంగా నిర్వహించుకుందని తెలిపింది. ఈ విమానాన్ని డీఆర్‌డీఓకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ డిజైన్‌ చేసి అభివృద్ధి చేసింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన సాధించేందుకు ఇదో కీలక ముందడుగుగా డీఆర్‌డీఓ అభివర్ణించింది.


మరోవైపు దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి-ఏటీజీఎమ్​ను.. డీఆర్‌డీఓ, సైన్యం విజయవంతంగా పరీక్షించాయి. బుధవారం మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో భారత సైన్యం, డీఆర్‌డీఓ సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించాయి. అర్జున్‌ యుద్ధ ట్యాంకు నుంచి ఏటీజీ క్షిపణిని ప్రయోగించగా అది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణికి ఉంది.

అభ్యాస్ హై స్పీడ్ ఏరియ‌ల్ టార్గెట్‌(హెచ్​ఈఏటీ) ఎయిర్‌క్రాఫ్ట్‌ను సైతం డీఆర్‌డీఓ అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపుర్‌లో గల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి అభ్యాస్‌ను ప్రయోగించారు. ప్రయోగం సందర్భంగా హెచ్​ఈఏటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అతి తక్కువ ఎత్తులో పరీక్షించారు. ఆ సమయంలో సెన్సార్లు ఏరియల్‌ టార్గెట్‌కు చెందిన రాడార్‌, ఎలక్ట్రికల్‌ ఆప్టికల్‌ సిస్టమ్‌ను ట్రాక్‌ చేశాయి. ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీస‌ర్చ్‌, డీఆర్డీవోలు సంయుక్తంగా అభ్యాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేశాయి. ఈ నేపథ్యంలో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన మానవ రహిత యుద్ధ విమానం, ఏటీజీ క్షిపణితో పాటు హెచ్​ఈఏటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ సైన్యం చేతికి వస్తే భారత సైనిక వ్యవస్థ బలం మరింత పెరగుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'ద్రౌపది గెలిచే అవకాశం'.. మమత జోస్యం.. దీదీపై కాంగ్రెస్​ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.