ETV Bharat / bharat

'230kmph వేగమా.. చచ్చిపోతాం రా'.. అన్న కొద్దిసేపటికే నలుగురు మృతి.. వీడియో వైరల్​

author img

By

Published : Oct 17, 2022, 7:37 PM IST

గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తోన్న ఓ కారు.. ట్రక్కును ఢీకొట్టడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం జరగగా.. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి వీడియో వైరల్​గా మారింది.

BMW crash on highway video
230 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

అతివేగం, నిర్లక్ష్యం నలుగురు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తోన్న ఓ కారు.. కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టి తునాతునకలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో గత శుక్రవారం ఈ ప్రమాదం జరగగా.. ఘటనకు గల కారణాలు తాజాగా బయటికొచ్చాయి. ప్రమాదం సమయంలో కారు వేగం గంటకు 230 కిలోమీటర్లు ఉండగా.. 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు వారు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌పై సుల్తాన్‌పుర్‌ సమీపంలో గత శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తోన్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వచ్చిన కంటైనర్‌ను ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాదానికి కొద్ది సేపటి ముందు కారులో ఉన్న ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ చేశాడు. అప్పుడు కారు వేగం గంటకు 230 కిలోమీటర్లుగా ఉంది. 'మనం లైవ్‌లో ఉన్నాం. 300 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్‌ చేయు అని వీడియో తీస్తున్న వ్యక్తి డ్రైవర్‌కు చెప్పాడు. దీనికి కారులో ఉన్న మరో వ్యక్తి స్పందిస్తూ.. 'అంత వేగమా.. మనం నలుగురు చచ్చిపోతాం రా' అని అన్నాడు. 'మీరంతా సైలెంట్‌గా ఉండండి. అప్పుడే నేను డ్రైవ్‌ చేయగలను' అని కారు నడుపుతున్న వ్యక్తి అంటున్నట్లుగా వీడియోలో ఉంది. 230 కిలోమీటర్ల వేగం వద్ద డ్రైవర్‌.. కారు వేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాడు. దీనికి కారులో కూర్చున్న మరో వ్యక్తి.. 'ఎందుకు బ్రేక్‌లు వేస్తున్నావ్‌. వేగం తగ్గించకు. మళ్లీ మనం పిక్‌అప్ చేసుకోలేం' అని అన్నాడు.

ఈ సంభాషణలు ముగిసిన కాసేపటికే కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే.. కంటైనర్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ఇంజిన్‌ పేలి అందులో కూర్చున్న నలుగురు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకరు డాక్టర్‌, మరొకరు ఇంజినీర్‌ కాగా.. మరో ఇద్దరు వ్యాపారులు అని పోలీసులు తెలిపారు. అయితే ఘటన సమయంలో వారు మద్యం సేవించారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఘటన తర్వాత కంటైనర్‌ డ్రైవర్‌ పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.