ETV Bharat / bharat

'చట్టానికి లోబడే తీర్పు'.. అత్యాచార దోషులకు శిక్ష రద్దుపై సుప్రీం వివరణ

author img

By

Published : Nov 8, 2022, 4:02 PM IST

సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తగా.. వాటికి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కింది కోర్టుల్లో ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు జరిగినట్లు పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానంలో నిందితులు నేరానికి పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ధర్మాసనం.. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వారికి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది.

chawla rape case
chawla rape case

సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చుతూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం విమర్శలకు దారితీసింది. దీనిపై వివరణ ఇచ్చిన సుప్రీంకోర్టు.. నిందితులు నేరానికి పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. కిందిస్థాయి కోర్టుల్లో ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ కేసులో 49 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించగా... అందులో 10 మందిని డిఫెన్స్‌ కౌన్సిల్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయలేదని పేర్కొంది. దర్యాప్తు సమయంలో ఒక్క సాక్షి కూడా నిందితులను గుర్తించలేదని తెలిపింది. మృతదేహం వద్ద లభించిన సాక్ష్యాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అత్యాచారం, హత్య జరిగిన మూడు రోజుల తర్వాత.. ఓ పొలంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు చెబుతున్నారని... అప్పటివరకు ఎవరూ మృతదేహాన్ని చూడకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.

మొత్తంగా ఈ కేసులో నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేవలం సహేతుకమైన సందేహాలు మినహా ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయిందని తెలిపింది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు కొన్ని కీలక అంశాలను విస్మరించి తీర్పు వెలువరించిందని, దాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అందుకే బెనిఫిట్‌ ఆఫ్ డౌట్‌ కింద అత్యంత క్రూరమైన నేరంలో నిందితులుగా ఉన్నప్పటికీ వారిని నిర్దోషులుగా ప్రకటించడం తప్ప కోర్టుకు మరో అవకాశం లేకుండా పోయిందని స్పష్టం చేసింది. నైతిక నేరారోపణ ఆధారంగా లేదా అనుమానంతో మాత్రమే నిందితులను శిక్షించడానికి చట్టం అంగీకరించదని వివరించింది. ఏ కేసులోనైనా కోర్టులు చట్టానికి లోబడే తీర్పులు ఇవ్వాలని గుర్తుచేసింది. నైతికపరమైన బయటి ఒత్తిళ్లు, ఇతర అంశాలు తీర్పును ప్రభావితం చేయకూడదని కోర్టు వివరించింది.

కేసు వివరాలివీ...
2012లో దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో 19ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఆ యువతి గురుగ్రామ్‌లోని సైబర్‌సిటీలో పనిచేస్తూ దిల్లీలో నివాసం ఉండేది. 2012 ఫిబ్రవరిలో కార్యాలయం నుంచి వస్తుండగా ఇంటికి సమీపంలోనే అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులు రవికుమార్‌, రాహుల్‌, వినోద్‌ ఆమెను కారులో తీసుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడడం సహా గాజు సీసాలు, లోహపు వస్తువులతో చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో దిగువ కోర్టు ఆ ముగ్గురినీ దోషులుగా తేల్చి, మరణశిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లినప్పుడు ఈ హత్యాచార ఘటనను అత్యంత దారుణమైనదిగా అభివర్ణించిన హైకోర్టు.. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ 2014లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.