ETV Bharat / bharat

అరుణాచల్​ టు లద్దాఖ్... బచేంద్రిపాల్ మరో సాహసయాత్ర

author img

By

Published : Jan 24, 2022, 6:34 AM IST

Updated : Jan 24, 2022, 7:09 AM IST

Bachendri Pal News: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్‌ మరో సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 50 ఏళ్లు పైబడ్డ పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా ఈ సాహసయాత్ర సాగనుంది.

bachendri pal news
బచేంద్రిపాల్‌

Bachendri Pal News: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్‌ మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' రోజైన మార్చి 8న బచేంద్రిపాల్‌ 67వ ఏట అడుగు పెడతారు. అదే రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా అయిదు నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగనుంది. వీటిలో 17,320 అడుగుల ఎత్తుతో పర్వతారోహకుల సామర్థ్యాన్ని పరీక్షించే లంఖాగా పర్వతమార్గం కూడా ఉంది. లద్దాఖ్‌లోని ద్రాస్‌ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఆగస్టు మొదటివారం లేదా రెండో వారంతో ఈ యాత్ర ముగుస్తుంది. 'టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌', కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్తంగా 'ఫిట్‌ ఇండియా' బ్యానరుపై నిర్వహిస్తున్న ఈ యాత్ర వాస్తవానికి గతేడాది మేలోనే ప్రారంభం కావాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ పరిస్థితులతో వాయిదా పడి, ఇప్పుడు జరగనుంది.

"ఈ యాత్ర స్ఫూర్తితో అన్ని వయసుల భారతీయ మహిళల్లో దేహ దారుఢ్యం, ఆరోగ్యం పట్ల స్పృహ పెరుగుతుంది. 50 ఏళ్లకు చేరుకోగానే మన జీవితం అంతమైనట్టు కాదు. ఎవరికివారు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ద్వారా జీవితాన్ని ఆ తర్వాత కూడా ఆస్వాదించవచ్చు అని చాటడమే ఈ యాత్ర ఉద్దేశం."

- బచేంద్రిపాల్‌

ఈ బృందంలో : బచేంద్రిపాల్‌, సారథి (67), చేతనా సాహూ (54, కోల్‌కతా), సవితా ధప్వాల్‌ (52, భిలాయ్‌), శ్యామలా పద్మనాభన్‌ (64, మైసూర్‌), గంగోత్రి సోనేజి (62, బరోడా), ఛౌలా జాగిర్దార్‌ (63, పాలన్‌పుర్‌), పాయో ముర్ము (53, జంషెడ్‌పుర్‌), డాక్టర్‌ సుష్మా బిస్సా (55, బికనేర్‌), మేజర్‌ కృష్ణా దూబే (59, లఖ్‌నవూ), బింబ్లా దేవోస్కర్‌ (55, నాగ్‌పుర్‌).

Motivational Story of Bachendri Pal: ఈ బృందానికి ఇటీవలే ఉత్తరకాశిలో వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు. యాత్రలో వీరికి సహకరించేందుకు, వంట పనులకు ఇద్దరు పురుష సభ్యులు కూడా తోడుంటారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దులోని పాంగ్‌సౌ పాస్‌ నుంచి యాత్ర మొదలై అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఠుంగ్రీ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, నేపాల్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల మీదుగా సాగుతూ.. కార్గిల్‌ జిల్లాలోని టైగర్‌ హిల్‌ వద్ద ముగుస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు బోస్ అవార్డు

Last Updated : Jan 24, 2022, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.