మట్టి మాఫియాపై ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను నిలదీసిన అనుచరుడు - YSRCP MLA Kaile Anil Kumar
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 7:20 AM IST
YSRCP Leader Fired on MLA Kaile Anil Kumar Krishna District : ఎన్నికల ప్రచారంలో కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. మట్టి అక్రమ తవ్వకాలపై సొంతపార్టీ నాయకులే నిలదీసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కైలే అనిల్ రెండు రోజుల క్రితం పామర్రు మండలం పెదమద్దాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా స్థానిక వైఎస్సార్సీసీ నాయకుడు యారం ప్రసాద్ అడ్డుకున్నారు. మట్టి మాఫియా విషయంలో తాను ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదంటూ బహిరంగంగా నిలదీశారు. తనకు సమాధానం చెప్పాకే అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయాలంటూ పట్టుపట్టారు.
"మా చెరువు తవ్వేసి మట్టి ఎత్తుకుపోతున్నారని మీకే చెప్పాను. కానీ మీరేమన్నారు. సంపాదించుకునే వాళ్లను చూసి ఎందుకు ఏడుస్తున్నావెందుకు అంటూ నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాకే అంబేడ్కర్ విగ్రహానికి దండలు వేయండి" -యారం ప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకుడు
యారం ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యే అనిల్ దిక్కులు చూస్తూ నిలబడిపోవడం గమనార్హం. ఈ నిలదీతను వైఎస్సార్సీపీ నాయకులే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రస్తుతం వైరల్గా మారింది.