వివాహ సమయంలో పురోహితుడిపై ఆకతాయిల దుశ్చర్య - బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం - Youth Misbehaved With Priest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 4:00 PM IST
Youth Misbehaved With Priest During Wedding Ceremony: కాకినాడలోని శివాలయంలో ఇద్దరు అర్చకులపై ఓ అధికార పార్టీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో పురోహితుడిపై ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఈ నెల 12న ఓ వివాహ కార్యక్రమాన్ని జరిపించేందుకు గ్రామానికి చెందిన పురోహితుడు ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ వెళ్లారు. వివాహం జరిపిస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు పురోహితుడిపై దుశ్చర్యకు పాల్పడ్డారు. పురోహితుడు శర్మ తలపై సంచి వేయడం, పసుపు, కుంకుమ, వాటర్ ప్యాకెట్లు చల్లడంతో పాటు ఇతర సామగ్రి విసిరారు. ఈ తంతు అంతా వీడియో చిత్రీకరించి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో బ్రాహ్మణ, విశ్వహిందూ పరిషత్తు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు సభ్యులు పురహితుడు శర్మ ఇంటికి వచ్చి పరామర్శించి జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. వివాహం జరిగిన ఇంటికి వెళ్లి దుశ్చర్యకి పాల్పడిన ఆకతాయిల వివరాలు అడిగారు. సంబంధిత ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని హిందూ పరిషత్ సంఘాలు డిమాండ్ చేశాయి.