చీపురుపల్లి టీడీపీలో అసమ్మతి సెగ- పార్టీ పదవికి రాజీనామా చేసిన కిమిడి నాగార్జున - TDP Kimidi Nagarjuna Resigns
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 10:46 PM IST
TDP Kimidi Nagarjuna Resigns: విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకట్రావును ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి రేగింది. విజయనగరం పార్లమెంట్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న కిమిడి నాగార్జున తన పదవికి రాజీనామా చేశారు. అతనితో పాటు నాలుగు మండలాల అధ్యక్షులూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చీపురుపల్లి నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించిన నాగార్జున ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించడంతో అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో అయిదేళ్లుగా ఎంతో పోరాటం చేశానని, అధిష్ఠానం తన పోరాటాన్ని గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. తాను మాటపై నిలబడే వ్యక్తిని అని, రాజీనామా విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పుకొచ్చారు. గడిచిన ఐదేళ్లలో పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. కాగా కిమిడి తీసుకున్న నిర్ణయంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తన భవిష్యత్తు కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని కిమిడి తెలిపారు. ఆయన ప్రకటనతో చీపురుపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఏ విధంగా మారుతాయో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.