అయిదేళ్లలో 2 వేల 540 కోట్ల దోపిడీ - ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై ధూళిపాళ్ల ధ్వజం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:47 PM IST

thumbnail

TDP Dhulipalla Narendra Kumar Allegations: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఐదేళ్లలో 2 వేల 540 కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డారని తెలుగుదేశం సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. పొన్నూరులో బహిరంగసభ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అక్రమాలపై ప్రజా ఛార్జిషీట్​ను నరేంద్ర విడుదల చేశారు. రోశయ్య అక్రమాలను ఎల్​ఈడీ తెరపై ప్రదర్శిస్తూ ప్రజలకు వివరించారు. ఒక్క ఛాన్స్ పేరుతో కిలారి రోశయ్య ఎమ్మెల్యేగా గెలిచారని, నియోజకవర్గంలో అడ్డగోలుగా మైనింగ్ చేపట్టి 2 వేల 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. 

అక్రమ సొమ్ములో తాడేపల్లి ప్యాలెస్​కు వాటాలు పంపించారన్నారు. ఎక్కడ వీలుంటే అక్కడ వసూళ్లు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు. గ్రావెల్ లారీల నుంచి నెలకు 14 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, భూముల అక్రమాలు, కబ్జాల ద్వారా రూ.64 కోట్లు సంపాదించారని, పొన్నూరు మున్సిపాలిటి అభివృద్ధి పనుల పేరిట రు.50 కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర ఆరోపించారు. బోగస్ డ్వాక్రా గ్రూపులతో రూ.100 కోట్లు రుణాలు పొందారని, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు, నెలవారీ మామూళ్లు రూ.5 కోట్లు అని ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియాను పెంచి ప్రోత్సహించారని, బెల్టుషాపుల నుంచి కమిషన్, బార్ల నుంచి వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి శాసనసభ్యుడు, అలాంటి పార్టీ మనకు అవసరమా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.