విజయవాడలో భూ కబ్జాల పేటెంట్ కేశినేని నానిదే - బాలయోగి ఆస్తులను తిరిగి అప్పగించాలి : వెంకన్న
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 4:43 PM IST
Buddha Venkanna Comments on Kesineni Nani: ఉల్లిపాయ బాంబేస్తే పారిపోయే కేశినేని నాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. దివంగత దళిత నేత బాలయోగి ఆస్తులను కొట్టేసిన చరిత్ర ఎంపీ కేశినేని నానీది అని బుద్దా వెంకన్న విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఆ ఆస్తులన్నింటినీ బాలయోగి కుటుంబ సభ్యులకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడలో భూ కబ్జాల పేటెంట్ కేశినేని నానిదేనని దుయ్యబట్టారు. పండగలప్పుడు బస్ టికెట్లను బ్లాక్లో అమ్ముకున్న చరిత్ర నానీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలలో ఏ వ్యక్తీ చేయని చెడ్డ పనులు కేశినేని నాని చేశారని బుద్దా వెంకన్న ఆరోపించారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేయడానికి భయపడుతున్నారని, అన్న వదిలిన బాణం ఇప్పుడు ఆయనకే గుచ్చుకుంటుందని ఎద్దేవా చేశారు. ఆంధ్రరత్న భవన్ మీద నుంచి బాణం వేస్తే తాడేపల్లి ప్యాలెస్కు తగులుతుందని హెచ్చరించారు.