రాజధాని ఫైల్స్​ చిత్రానికి ఏ పార్టీతో సంబంధం లేదు: మూవీ యూనిట్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 10:47 PM IST

thumbnail

Raajadhani Files Movie: అమరావతి రైతుల ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించిన రాజధాని ఫైల్స్‌ చిత్రానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. రాజధానిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే తాము ఈ చిత్రాన్ని నిర్మించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం ప్రివ్యూ షోకు అమరావతి రైతు నేతలు హాజరై వీక్షించారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నటీనటులు వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్‌తోపాటు ఇతర నటులు హాజరయ్యారు. 

అయితే సినీ దర్శకుడు రాం గోపాల్​ వర్మ అదే సమయంలో ప్రసాద్​ ల్యాబ్​ వద్దకు రావడంతో, అమరావతి రైతు నేతలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. వ్యూహం చిత్రం మీడియా సమావేశం కోసం వర్మ అక్కడకు వచ్చారు. వర్మ రాకను గమనించిన మహిళ రైతులు, జై అమరావతి అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ప్రసాద్​ ల్యాబ్​ సెక్యూరిటీ సిబ్బంది రైతు నేతలను అడ్డుకున్నారు. రైతుల నినాదాలు పట్టించుకోకుండానే వర్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

రాజధాని ఫైల్స్​ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్​: మరోవైపు రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శన ఆపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వైఎస్సార్​సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.