బొప్పూడిలో కూటమి ‘ప్రజాగళం’ - భద్రత కట్టుదిట్టం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 12:35 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-03-2024/640-480-21006077-thumbnail-16x9-prajagalam.jpg)
Prajagalam Public Meeting Arrangements : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ‘ప్రజాగళం’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు పార్టీల నాయకుల నిర్విరామ కృషితో పూర్తయిన వేదిక నిర్మాణం, ఎన్ఎస్జి అధికారులకు అప్పగించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక జరుగుతున్న ప్రజాగళం సభపై రాష్ట్ర ప్రజానీకం ఆసక్తి, ప్రజలు భారీగా సభకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికను పంచుకోనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పకడ్బందింగా ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నారా లోకేశ్: మూడు పార్టీల మధ్య పొత్తు ఖాయమయిన అనంతరం జరిగే తొలి ఎన్నికల సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహిస్తున్న ‘ప్రజాగళం’ బహిరంగ సభ మరో ఎత్తు అన్నట్లు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. సభ నిర్వాహణ కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో మూడు పార్టీల ముఖ్యనేతలతో, ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ‘ప్రజాగళం’ బహిరంగ సభకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.