గంపగుత్తగా ఓట్ల బదిలీ- సీఈవోకు ఫిర్యాదు చేసిన పోలవరం నిర్వాసితులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 8:30 PM IST
Polavaram Voters Complained to CEO: గంపగుత్తగా ఓట్లను బదిలీ చేశారంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. తమ సమ్మతి లేకుండా రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2 వేల 4వందల 75 ఓట్లను బదిలీ చేశారని ఫిర్యాదుచేశారు. పోలవరం ప్రాజెక్టులోని దేవీపట్నం, తోయ్యేరు గ్రామాలకు చెందిన ఓట్లను వేరే నియోజకవర్గానికి గంపగుత్తగా బదిలీ చేయడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు తెలియకుండా తమ ఓట్లను ఇతర ప్రాంతానికి ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. తక్షణం తమ ఓట్లను తమ స్వస్థలాలకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. తమలో చాలా మందికి ఇంకా పోలవరం పరిహారం అందలేదని, ఇప్పుడు ఓట్లు మార్చడం వలన ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధాన అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.