మూలపేటలో ఉద్రిక్త వాతావరణం - వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం - People Protest in Mulapeta
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 3:39 PM IST
People Protest in Mulapeta: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలోగ్రీన్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో పోర్టు యాజమాన్యం ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఉపాధి పనుల కోసం వెళ్లిన వారిని సిబ్బంది ఆపడంతో పోర్టు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు, పోర్ట్ యాజమాన్య ప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగింది.
తమ సొసైటీ భూముల్లో ఉపాధి పనులు చేసుకుంటే పోర్టు యాజమాన్యం అడ్డుకోవడం దారుణం అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సంబంధిత భూములకు ఇప్పటికే పరిహారం చెల్లించామని యాజమాన్యం చెప్పడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సొసైటీ భూములు మీకు ఎవరు అప్పగించారని, ఎవరి ఖాతాలో నష్టపరిహారం వేశారో బహిర్గతం చేయాలని మూలపేట గ్రామస్థులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతల పేరు మీద భూ దస్త్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. పరస్పరం దాడులు జరగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమ ఉపాధికి ఆటంకం కలిగిస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.