పీఎఫ్ఐ కేసులో అబ్దుల్ సలీంను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 10:48 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/640-480-20899076-thumbnail-16x9-nia-arrested-pfi-accused-abdul-saleem.jpg)
NIA Arrested PFI Accused Abdul Saleem: నిషేధిత పీఎఫ్ఐ(PFI) ఉత్తర తెలంగాణ కార్యదర్శి అబ్దుల్ సలీం అరెస్ట్ వైఎస్సార్ జిల్లాలో అలజడి సృష్టించింది. చెర్లోపల్లెలో శనివారం తెల్లవారుజామున సలీంను ఎన్ఐఏ(NIA) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఉన్న మసీదు ఆధారంగా అతడు జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దర్యాప్తు సంస్థ అధికారులు గ్రామానికి రావడంతో సలీం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India)కు సంబంధించి తొలుత నిజామాబాద్ పోలీసులు 2022 జులైలో కేసు నమోదు చేశారు. ఉగ్రవాద సంబంధాలు ఉండటంతో అదే ఏడాది ఆగస్టులో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ(National Investigation Agency Government of India) అబ్దుల్ సలీంతో కలిపి ఇప్పటివరకూ 15 మందిని అరెస్టు చేసింది. గతేడాది మార్చిలో 11 మంది నిందితుల పేర్లతో ఛార్జిషీటు దాఖలు చేసింది. దానికి అనుబంధంగా గత డిసెంబరులో మరో ఐదుగురి పేర్లతో అనుబంధ ఛార్జిషీటు వేసింది.