పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారు ? పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ కనకమేడల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 7:06 PM IST
MP Kanakamedala Ravindra Kumar: పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పార్లమెంటులో మరోసారి గళమెత్తారు. నాలుగున్నరేళ్లుగా పోలవరం పనుల్లో పురోగతి లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. దీనికి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత ఏపీ సర్కార్ దేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ ఖర్చులను తర్వాత కేంద్రం రీయింబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లలో వేల కోట్ల రూపాయలు రీయింబర్స్ చేశామని లెక్కలతో సహా వివరాలిచ్చారు.
2020లో డయాఫ్రం వాల్ ధ్వంసమైతే, ఇప్పటి వరకు బాగు చేయకుండా ఏం చేస్తున్నారని మరో ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ పునరుద్ధరణకు ఏపీ, కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని గజేంద్ర సింగ్ తెలిపారు. డయాఫ్రం వాల్ నష్టంపై ఎన్హెచ్పీసీ అనే సంస్థ అంచనా వేస్తోందని, వాల్ పునరుద్ధరణకు ఏజెన్సీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ డిజైన్ల ప్రకారం వాల్ పునరుద్ధరణ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని షెకావత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదికను త్వరలో ఇస్తామని బదులిచ్చారు.