అనకాపల్లిలో దాడితో కొణతాల భేటీ - టీడీపీ-జనసేన శ్రేణుల్లో జోష్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 8:04 PM IST
Janasena Candidate Konatala met Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి దాడి వీరభద్రరావును అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ (Janasena candidate Konatala Ramakrishna) కలిశారు. దాడి వీరభద్రరావు ఇంటికి కొణతాల రామకృష్ణ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని ఇరు కుటుంబాల మధ్య చాలాకాలంగా పరిచయం ఉందని అందుకే కలిశామని కొణతాల వెల్లడించారు. జనసేన-తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు కేటాయించారు.
ఈ నేపథ్యంలో అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో తాను పోటీలో ఉన్నానని, దాడి వీరభద్రరావు సంపూర్ణ సహకారం కావాలని కొణతాల కోరారు. ఇటీవలే దాడి వీరభద్రరావు కుటుంబం తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని జనసేన - తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసేది టీడీపీ - జనసేన ప్రభుత్వమేనని అన్నారు. జగన్ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని ఈ నేపథ్యంలో ఇరు పార్టీల శ్రేణులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.