ఆ విధంగా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వలేం - కేఏ పాల్ పిల్పై హైకోర్టు వ్యాఖ్య
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 10:04 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-03-2024/640-480-20972564-thumbnail-16x9-high-court-on-ka-paul-petition.jpg)
High Court on KA Paul Petition: ఏపీలో ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి, తక్షణం ఓట్ల లెక్కింపు జరిపి ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా చూసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. పాల్ ఇచ్చిన వినతిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా, ఈవీఎంల ట్యాంపరింగ్కు గురికాకుండా ఉండేలా ఏపీలో ఎన్నికలు చివరి ఫేజ్లో నిర్వహించిన వెంటనే ఓట్ల లెక్కింపు జరపాలని కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేసి నేరుగా వాదనలు వినిపించారు. ఏపీకి మే నెల చివరి ఫేజ్లో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపై స్పందన లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఫలానా విధంగా, ఫలానా విడతలో ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరలేరన్నారు. ఈ పిల్కు విచారణ అర్హత లేదన్నారు. వినతి సమర్పిస్తే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.