వైసీపీ నేతల అండతో భూ అక్రమణ- పోలీస్స్టేషన్ వద్ద దళితుల నిరసన
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 7:00 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-03-2024/640-480-21018555-thumbnail-16x9-dalits-protest-that-land-has-been-seized-at-tirupati.jpg)
Dalits Protest That Land Has Been Seized at Tirupati: తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు పోలీస్స్టేషన్ వద్ద దళితులు నిరసన చేపట్టారు. మంగళం సమీపంలో 229 సర్వే నంబర్లోని దళితుల ఎకరా 30సెంట్ల భూమిని కబ్జా చేశారని ఆందోళన నిర్వహించారు. తిరుపతి, చంద్రగిరి వైసీపీ నేతల అండతో కొందరు తమ భూమిని అక్రమించారని ఆరోపించారు. భూ అక్రమణపై ప్రశ్నించినందుకు తమపై అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయించారని బాధితులు వాపోయారు. అరెస్టు చేసిన ముగ్గురు ఎస్సీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ భూములు కబ్జా చేసిన వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇదే విధంగా గూడూరులో రూ.కోట్లు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకుని ప్లాట్లు వేసి విక్రయించడానికి అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. దశాబ్దాల కిందట గ్రామంలో సర్వే నంబరు 105లోని 1.70 ఎకరాలు గంగమ్మ బావి పేరుతో దళితులకు కేటాయించారు. ఆ భూమి బస్టాండుకు సమీపంలో ఉండటంతో ఇళ్లు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉండగా ధరలకు రెక్కలొచ్చాయి. అక్కడ సెంటు స్థలం రూ.2 లక్షల వరకు పలుకుతుండటంతో ఆ స్థలం విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతో ఆ స్థలంపై అధికార పార్టీ నాయకులు ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలని వారికి అనుకూలంగా ఎస్సీల పేర్లతో దస్త్రాలు తయారు చేయించారు. అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి యత్నించడంతో దళితులంతా ఏకమై అడ్డుకున్నారు. ఆ భూమిని కొనుగోలు చేశామని ఇప్పుడు పూర్తి హక్కులు తనకే ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారు.