రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ - ఓట్ల అక్రమాలపై విచారణ జరిపించాలి : పురందేశ్వరి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 5:00 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2024/640-480-20561447-thumbnail-16x9-daggubati-purandeswari-comments.jpg)
Daggubati Purandeswari Comments: ఈ నెల 22 అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించకుండా ఉండడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. మిగతా రాష్ట్రాల్లో సెలవు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు సెలవు ప్రకటించినప్పుడు, ఏపీలో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అని అన్నారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం, ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని పురందేశ్వరి మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని పురందేశ్వరి హెచ్చరించారు. అదే విధంగా తిరుపతిలో జరిగిన నకిలీ ఓట్ల వ్యవహారంపై బీజేపీ ఫిర్యాదు కారణంగా అధికారులు స్పందించారని తెలిపారు. ఓట్ల అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపించాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారం గురించి తెలియజేశారు. నంద్యాలలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి పురందేశ్వరి హాజరయ్యారు.