యువజన, విద్యార్థి సంఘాల చలో సీఎం ఆఫీస్- మద్దతు ప్రకటించిన సీపీఐ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 5:20 PM IST

thumbnail

CPI Supports Chalo CM Camp Office Program : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మార్చి ఒకటో తేదీన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమానికి సీపీఐ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలోని దాసరి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ మినహా అన్ని పార్టీలు 2019లో ప్రత్యేక హోదా అజెండాగా ఎన్నికలకు వెళ్లారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీలో నిరసన తెలిపితే, ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన ఎంపీలతో రాజీనామా చేయించాడని రామకృష్ణ గుర్తు చేశారు. నేడు విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి మద్దతు తెలుపుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ప్రత్యేక హోదా సాధనకై చేపట్టాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలన్నారు. 

నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ : ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ నేడు నామ మాత్రపు డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పరీక్షకు మూడు నెలలు కనీస గడువు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 1/6 శాతం రైతులకు మాత్రమే సీఎం లబ్ధి చేకూర్చి 100 శాతం రైతులకు మేలు చేశామని చెప్పడం విచారకరమన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.