కృష్ణా నది తీరం వెంట కట్టిన రక్షణగోడను ప్రారంభించిన సీఎం జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 8:20 PM IST
CM Jagan Inaugurated Defensive Wall: విజయవాడలో కృష్ణానది తీరం వెంట కట్టిన రక్షణ గోడను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించారు. నదీ తీరం వెంట ప్రాంతాలు ముంపు బారిన పడకుండా రక్షణ కోసం కృష్ణానదికి రెండువైపులా 500 కోట్లతో రక్షణ గోడతో పాటు కరకట్ట నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. కనకదుర్గ వారధి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. కృష్ణా నదీ తీరం వెంట పార్కుల నిర్మాణం సహా సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.
"కృష్ణమ్మ జలవిహార్" (Krishnamma Jalavihar) పేరుతో కృష్ణానదికి ఇరువైపులా పార్కులు అభివృద్ది చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా విజయవాడలో 31 వేల 866 మంది పేదల ఇళ్ల స్థలాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశారు. దీంతోపాటు 239 కోట్ల రూపాయలతో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 58 నెలల వైసీపీ పాలనలో విజయవాడలో పెండింగ్ ఫ్లైఓవర్లను పూర్తి చేయడంతోపాటు మరో రెండు ఫ్లై ఓవర్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్లు సీఎం తెలిపారు.