అమరావతి నిర్మాణానికి తెచ్చిన సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నారు: లంకా దినకర్ - BJP LANKA DINAKAR COMMENTS
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 4:28 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-05-2024/640-480-21570016-thumbnail-16x9-bjp-lanka-dinakar-comments.jpg)
BJP LANKA DINAKAR COMMENTS: ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనూ వైఎస్సార్సీపీ సర్కార్ దోపిడీ ఆపలేదని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. అమరావతి నిర్మాణానికి సీఆర్డీఏ పరిధిలోని విద్యుత్తు పనులకు సంబంధించిన అండర్గ్రౌండ్ కేబుల్, ఇతర సామగ్రిని నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, వెలిగొండ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైన మెగా ఇంజినీరింగ్ కంపెనీకు ఇప్పటికే అనేక ప్రాజెక్టులను జగన్ అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు.
రాష్ట్రంలో సీఎం జగన్ మిత్ర కంపెనీలు అయిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్తు ప్రాజెక్టుల పేరుతో దాదాపు నాలుగు లక్షల ఎకరాలు కొల్లగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని లంకా దినకర్ విమర్శించారు. షిర్డీ సాయి, ఇండో సోల్ కంపెనీలు జగన్ ఆత్మగా వ్యవహరిస్తున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందని ఆరోపించారు.
మద్యం, ఇసుక మాఫియా ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, యాక్సిస్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి బినామీ కంపెనీలకు జగన్ మళ్లించారని ఆరోపించారు. దీనికి తోడు గత ఐదేళ్లలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్, ఎలక్ట్రికల్ మీటర్లు, ఇతర సామాగ్రి సరఫరాకు అత్యధిక ధరలను చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కాంట్రాక్టులు ఇచ్చిందని ధ్వజమెత్తారు.